కాంగ్రెస్‌కు మాజీ సీఎం న‌ల్లారి రిజైన్‌

గ‌త కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న చ‌ర్చే నిజ‌మైంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వ‌ర‌లోనే బీజేపీలోకి చేర‌తారంటూ.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న బీజేపీలోకి చేర‌తారో.. లేదో.. లైన్ క్లియ‌రైందో లేదో.. అనే సందేహాలు మాత్రం వెంటాడాయి. తాజాగా దీనికి కూడా ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. తాజాగా న‌ల్లారి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ జాతీయ‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు త‌న‌ రాజీనామా లేఖను న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పంపించారు. కేవ‌లం ఒకే ఒక వాక్యం పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి నేను చేసిన రాజీనామాను ద‌య‌చేసి ఆమోదించ‌గ‌ల‌రు” అని మాత్ర‌మే ఆయ‌న రాశారు. ఇక‌, ఇత‌ర కార‌ణాలేవీ కూడా పేర్కొన‌లేదు. దీంతో ఆయ‌న రాజీనామా ఖ‌రారైన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. బీజేపీలో న‌ల్లారికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి గతంలోనూ ఇలాంటి చర్చే జరిగినా.. ఆయన కాంగ్రె‌స్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌చేపట్టిన జోడో యాత్రకు కూడా నల్లారి దూరంగా ఉండడంతో ప్రస్తుత చర్చపై ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి రెడీ అయిపోయార‌ని తాజా రాజీనామా స్ప‌ష్టం చేస్తోంది. అయితే.. ఆయ‌న‌ను తెలంగాణ‌లో ని పార్టీలోకి తీసుకుంటారా? లేక‌.. కేంద్రంలో బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.

రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన ఆయన.. విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. అయితే ఎవరూ గెలవలేదు. దీంతో సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఏపీసీసీ సమన్వయకమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.