ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌!

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో వ‌రుస ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ కుంభ‌కోణంలో సౌత్ గ్రూప్ పాత్ర ఉంద‌ని.. 100 కోట్లు ఈ గ్రూప్ .. ఆప్‌కు చేర‌వేసింద‌ని ఈడీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఎమ్మెల్సీ క‌విత‌కు అరుణ్ రామచంద్ర పిళ్ల‌యే బినామీ అని కూడా చెప్పింది. దీని ఆధారంగానే క‌విత‌ను విచారించేందుకు కూడా రెడీ అయింది. అయితే.. అనూహ్యంగా పిళ్ల‌య్‌.. త‌న వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకుని.. ట్విస్ట్ ఇచ్చాడు.

ఈ కార‌ణంగానే క‌విత‌ను అరెస్టు చేయ‌లేద‌నే వాద‌న ఢిల్లీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీని నుంచి ఈడీ కోలుకోక ముందే.. మ‌రో భారీ దెబ్బ‌త‌గిలింది. ఈడీ త‌ర‌ఫు లిక్క‌ర్ కుంభ‌కోణం కేసుల‌ను వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. పైకి ఆయ‌న వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించినా.. ఈడీ ఒత్తిడి భ‌రించ‌లేకే.. ఆయ‌న రాజీనామా చేశార‌ని.. ఢిల్లీలోని ఆప్ వ‌ర్గాలు ప్ర‌చారం ప్రారంభించాయి.

2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ క‌ర్ణాట‌క‌ నాయకుడు డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున వాద‌న‌లు వినిపించారు. ఇప్పుడు లిక్క‌ర్ కేసును ఈడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీనిని కూడా రాణానే వాదిస్తున్నారు. అయితే.. ఆయ‌న తాజాగా రాజీనామాలేఖ స‌మ‌ర్పించడంతో లిక్క‌ర్ కేసు.. వ్య‌వ‌హారంలో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.