వివేకా హ‌త్య‌..’మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’.. ఎవ‌రికి అవినాష్ స‌ర్‌?!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విషయంలో ఆది నుంచి కూడా ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కేసును చివ‌ర‌కు.. ఆయన కుమార్తె, అల్లుడి నెత్తినే వేసేందుకు తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కూడా వారు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ సందేహాలు కూడా నిజం అవుతుండ‌డం నివ్వెర పోయేలా చేస్తోంది.

తాజాగా ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఇదే విష‌యాల‌ను కోర్టుకు వెల్ల‌డించ‌డంతో అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు.. ఆయ‌న మీడియాతోనూ ఇవే వ్యాఖ్య‌లు ఏశారు. వివేకాది ‘మర్డర్ ఫర్ గెయిన్'(ల‌బ్ధి కోసం హ‌త్య‌) కేసు అని చెప్పారు. అయితే.. ఈ ల‌బ్ధి ఏంటి? ఎవ‌రికి అనేదే ఇప్పుడు అనేక చిక్కుముళ్లే వేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీ సీటు కోసమే ఈ హ‌త్య జ‌రిగింద‌ని వైఎస్ ష‌ర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అంటే.. ల‌బ్ధి అవినాష్‌కు క‌లిగిందనేగా?!

అయితే, ఇప్పుడు అవినాష్ మాత్రం ‘మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’ వివేకా కూతురుకు, అల్లుడికి అనే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం నివ్వెర పోయేలా చేస్తోంది. వివేకా ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారని, ఆమెకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని, అంతేకాకుండా.. వివేకా త‌న‌ పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని అవినాష్ చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలో వివేకా ఆస్తులన్నీ ముస్లిం భార్య కుటుంబానికి వెళ్లిపోతాయని, రాజకీయ వారసులుగా వస్తారని భావించిన వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కుట్ర చేశార‌ని తన అనుమానమని అవినాష్ క‌థ అల్లేశారు. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించా రు. హత్య వెనుక‌ ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పారు.

అయితే.. ఈ ‘మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’లో సందేహాలు అనేకం ఉన్నాయ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
1) వివేకా ముస్లిం మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్న‌ది ఇప్పుడు కాదు. వైఎస్ హ‌యాంలోనే ఆయ‌న ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత‌.. కోర్టు జోక్యంతో అంద‌రికీ తెలిసిందే.
2) అప్ప‌ట్లోనే భ‌ర‌ణం కింద‌.. ఆమెకు కొంత భూమిని ఇచ్చేశారు. సో.. ఈ విష‌యంలో ఆస్తి త‌న‌కు అవ‌స‌రం లేద‌ని ముస్లిం భార్య అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది.
3) వివేకా హ‌త్య త‌ర్వాత‌.. ముస్లిం భార్య వ‌చ్చి.. ఆయ‌న పార్థివ దేహాన్ని చూసివెళ్లారు. ఆమె ఎవ‌రిపైనా అనుమానాలు వ్య‌క్తం చేయ‌లేదు. మ‌రి ఆమెకు లేని అనుమానాలు.. అవినాష్‌కు ఎందుకు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. వివేకా కేసు మాత్రం ఇప్ప‌ట్లో కొలిక్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.