రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎక్కడా నిరాశ చెందకుండా జీవితాంతం పదవీకాంక్షతో కొనసాగడమే రాజకీయమవుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గెలవలేమని, పార్టీ టికెట్ రాదని తెలిసి కూడా రోజూ ప్రకటనలు ఇస్తూ ఆశగా చూడటమే రాజకీయమనాల్సి ఉంటుంది..
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఓడిపోయిన తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పైగా ఆయన్ను వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. దానితో హైదరాబాద్ నివాసంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శివరామే అంతా..
కోడెల సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తనయుడైన కేన్సర్ వైద్యుడు డాక్టర్ శివరాం అంతా తానై నడిపించారు. వసూళ్ల దందాను సమర్థంగా నిర్వహించారు. శివప్రసాదరావు ఓటమికి శివరాం కూడా ఒక కారణమని చెబుతారు. తండ్రి మరణం తర్వాత మాత్రం శివరాం బుద్ధిగా పార్టీలో పనిచేసుకుంటున్నారు.
సత్తెనపల్లి టికెట్ కోసం..
2024లో సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కోడెల శివరాం ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నారు. నియోజకవర్గంలో మంచి పేరు కోసం అన్న క్యాంటిన్ పెట్టారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబును , లోకేష్ ను కలిశారు. వాళ్లు కుదరదని చెప్పేశారు. 2029 వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఈ లోపు మంచి పనులు చేసినట్లుగా అనిపిస్తే 2024లో పార్టీ గెలిచిన తర్వాత వేరే విధంగా అకామడేట్ చేస్తామని హామి ఇచ్చారు. అప్పటి వరకు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని తేల్చేశారు. అయినా శివరాం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అక్కడక్కడా నాయకులను కలుస్తూ మీటింగులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు..
కోడెల విగ్రహావిష్కరణ
సత్తెనపల్లి నియోజకవర్గం పెద్దమక్కెనలో శివరాం స్వయంగా కోడెల శివప్రసాద్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. దానికి స్థానిక నేతలతో పాటు నారా రోహిత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తొలుత పోలీసులు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా తర్వాత సభకు అనుమతించారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని శివరాం ఆ సభలో ప్రకటించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉండి నడిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో తాను పోటీ చేస్తానన్నారు. సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలకు ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.
తలపట్టుకుంటున్న టీడీపీ నేతలు
శివరాం తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లిలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబును ఓడించేందుకు తాము శ్రమపడుతుంటే పార్టీలో ఐక్యతను శివరాం దెబ్బతీస్తున్నారని కొందరు అంటున్నారు. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు సత్తెనపల్లి టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కన్నా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. సరిగ్గా ఇప్పుడే శివరాం ప్రకటనలు పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారాయి..
Gulte Telugu Telugu Political and Movie News Updates