నియోజ‌క‌వ‌ర్గం మార్పు… రోజా క‌ష్టాలు ఎలా ఉన్నాయంటే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకు నియోజ‌క‌వ‌ర్గం క‌ష్టాలు ముసురుకున్నాయి. ప్ర‌స్తుతం న‌గ‌రి నియోజ‌క వ‌ర్గం నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న ఆమెకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతా లు వ‌చ్చేశాయి. ఆమె ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని పార్టీ అంచ‌నా వేసేసింది. పార్టీలోని సొంత నేత‌లే.. ఆమెకు ఎగ‌స్పార్టీగా మారిపోయారు.

దీనికి తోడు న‌గ‌రిలో రోజాకు అస‌మ్మ‌తి వ‌ర్గంగా ఉన్న కేజే కుమార్‌.. ఇటీవ‌ల తాడేప‌ల్లిలో క‌నిపించ‌డం.. ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం ఇస్తోంది. కేజే కుమార్ వ‌ర్గం ఒక‌ప్పుడు రోజా త‌ర‌ఫునే ప‌నిచేసింది. అయితే, గ‌త మూడేళ్లుగా మాత్రం రోజాతో కుమార్ వ‌ర్గానికి పొస‌గ‌డం లేదు. కుమార్‌కు కీల‌క మంత్రి అండ‌గా ఉన్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ నేప‌థ్యంలోనే కుమార్ స‌తీమ‌ణికి.. నామినేటెడ్ పోస్టు కూడా ఇప్పించ‌కున్నారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుమార్ స‌తీమ‌ణిని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రంగంలోకి దింపుతార‌ని తెలుస్తోం ది. దీంతో రోజాకు నియోజ‌క‌వ‌ర్గం మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే.. రోజా మాత్రం ఇలాంటి ప్ర‌చారం త‌నంటే గిట్ట‌నివారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కానీ, అంత‌ర్గ‌త‌స‌ర్వేలు.. ఐప్యాక్ స‌ర్వేలు ఇలా ఏవిచూసుకున్నా.. రోజాకు క‌ష్టాలు మాత్రం త‌ప్ప‌వ‌ని.. ఈ ద‌ఫా ఓట‌మిని ఆమె ఎదుర్కొంటార‌ని తేల్చి చెబుతున్నాయి.

ప్ర‌ధానంగా టీడీపీ ప‌ట్ల ఇక్క‌డ(న‌గ‌రి) సానుభూతి క‌నిపిస్తోంద‌న్న‌ది ప్ర‌ధాన మాట‌. గాలి ముద్దుకృష్ణ మ నాయుడు కుమారుడు భాను ప్ర‌కాశ్‌కు ఇక్క‌డ గ్రాఫ్ పెరిగింది. రెండు సార్లు రోజాకు అవ‌కాశం ఇచ్చామ‌ని ..ఈ ద‌ఫా భానుకు ఛాన్స్ మిస్ చేయొద్ద‌ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ గూటి నుంచి టీడీపీలోకి చేరిక‌లు కూడా పెరిగాయి. ఫ‌లితంగా రోజాకు మార్పు ఖాయంగానే క‌నిపిస్తోంది. కానీ, ఆమె మాత్రం ధైర్యంగానే ఉన్నారు. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.