వైసీపీకి 157 ప‌క్కా.. మిగిలిన 18 లోనే పోటీ..

kodali

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న‌దైన శైలిలో స‌ర్వే రిపోర్టు ను ఆవిష్క‌రించారు.(జాబితా కాదులేండి). వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్ర‌జాబాట ప‌డుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ ప‌కు కార్య‌క్ర‌మంలో తిరుగుతున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా త‌మ‌కు ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని కానీ, ఇన్నిచోట్ల గెలుస్తామ‌ని కానీ చెప్ప‌డం లేదు.

కానీ, తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మా నాయ‌కుడు వైనాట్ 175 అంటున్నాడు. అయితే.. నేను ఒక్క‌టే చెబుతున్నా. రాష్ట్రంలో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చేది ప‌క్కా. చంద్ర‌బాబునాయుడు, పేప‌ర్ పులులు ఎంత త‌న్నుకున్నా.. ఈ విష‌యంలో ఎలాంటి మార్పూ లేదు. రాదు. అయితే.. 18 స్థానాల్లో మాత్ర‌మే గ‌ట్టిపోటీ ఉంటుంది. ఆ 18 చోట్ల మేం జాగ్ర‌త్త‌గా ఉంటే చాలు. మిగిలిన 157 స్థానాల్లోనూ వైసీపీ దిగ్విజ‌యంగా దూసుకుపోతుంది. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు అని కొడాలి త‌న స‌ర్వేను చెప్పుకొచ్చారు.

అయితే.. కొడాలి చెప్పిందే నిజమ‌ని అనుకుంటే.. ఆ 18 నియోజ‌క‌వ‌ర్గాలు ఏంటి? ఎక్క‌డ ఉన్నాయ‌నే విష‌యం కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతానికి ఉన్న అంచ‌నాల మేర‌కు కుప్పం(చంద్ర‌బాబు), మంగ‌ళ‌గిరి(లోకేష్ పోటీ చేసేది), హిందూపురం(బాల‌య్య‌), టెక్క‌లి(అచ్చ‌న్నాయుడు), పాల‌కొల్లు(నిమ్మ‌ల రామానాయుడు), స‌త్తెన‌ప‌ల్లి(అంబ‌టి ఉన్నారు), విశాఖ‌లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు, క‌ర్నూలు(ప్ర‌స్తుతం వైసీపీనే ఉంది), నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ వంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూర‌ల్‌, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి కూడా ఉండి ఉండొచ్చ‌ని.. వీటిని దృష్టిలో పెట్టుకునే కొడాలి ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.