‘జగన్ పిచ్చి వేషాలు’: రేణుకా చౌదరి

సీనియర్ పొలిటీషియన్ రేణుకా చౌదరి. తాజాగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాల్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన మాటలు మంట పుట్టేలా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా గొప్ప పాలన చేసిన రాజశేఖర్ రెడ్డికి తన సంతానం కారణంగా సుఖం లేకుండా పోయిందని రేణుకా చౌదరి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ ఆత్మకు శాంతి లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. పిచ్చి వేషాలు వేస్తున్నారన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ విషయాలు బయటకు రాకుండా తండ్రిగా కాపాడినట్లుగా పేర్కొన్నారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్న ఆమె.. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఏపీ ప్రజల పరిస్థితి చూస్తే కోపం తెచ్చుకోవాలో.. జాలి పడాలో.. ఆక్రోషం తెచ్చుకోవాలో అర్థం కావట్లేదన్న ఆమె.. బంగారం లాంటి రాష్ట్రం పతనమైపోతుందన్నారు.

అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవటం ఏమిటన్నారు. నందమూరి తారక రామారావు కూడా రాజశేఖర్ రెడ్డిని గౌరవించేవారని.. వారిద్దరికి ఒకరిపై మరొకరికి గౌరవం ఉండేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చటం ద్వారా ఎన్టీఆర్ కే కాదు వైఎస్ ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేశారన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్ ముందు రాష్ట్రానికి ఒక వర్సిటీని తీసుకొచ్చి.. దానికి మీ తాత పేరో.. నీ పేరో పెట్టుకో’’ అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి రైతులకు ఎంత అడ్డుపడితే ఉద్యమం అంతగా బలపడుతుందన్నఆమె.. రాజధాని రైతులు పిలిస్తే తాను ఏ క్షణంలో అయినా వస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు.