ఏపీలో మ‌రో స‌ల‌హాదారు.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌!

jagan

ఏపీ స‌ర్కారులో మంత్రుల‌కు మించి.. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. మంత్రి వ‌ర్గం క‌న్నా డ‌బుల్ సంఖ్య‌లో ఉన్నార‌నేది అంద‌రికీ తెలి సిందే. దీనిపై కూడా ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయినా.. ప్ర‌స్తుతం 56 నుంచి 62 మంది స‌ల‌హాదారులు ఉన్నారు. అయితే.. వీరిపై అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. తెల్ల ఏనుగుల‌ను పోషిస్తున్నారనే కామెంట్లు కూడా వ‌చ్చాయి. అంతేకాదు.. ఈ స‌ల‌హాదారుల ప‌రిస్థితి ఏంటంటూ.. హైకోర్టులో అనేక కేసులు కూడా ప‌డ్డాయి. వీటిలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ దాఖ‌లు చేసిన కేసు ప్ర‌స్తుతం విచార‌ణ‌లో ఉంది.

ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలోనే అస‌లు ఆర్థిక‌ప‌రిస్థితిలో అధ‌మంగా ఉన్న ఏపీకి ఇంత మంది స‌ల‌హాదారులు అవ‌స‌ర‌మా? అని కోర్టు ప్ర‌శ్నించింది. అంతేకాదు.. రేపు త‌హ‌సీల్దార్ల‌కు కూడా స‌ల‌హాదారుల‌ను నియ‌మించేలా ఉన్నారంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించింది. అయితే.. ఇవ‌న్నీ లెక్క‌చేసేవారికి. కానీ, ఏపీ ప్ర‌భుత్వం ఏనాడూ.. కోర్టు వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ.. స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తూనే ఉన్నారు సీఎం జ‌గ‌న్‌. హైకోర్టు ఇంత మాట అనేశాక‌.. న‌టుడు అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియ‌మించారు.

మ‌రి ఇప్పుడు ఎవ‌రిని?

ఇక‌, ఇప్పుడు సీఎం జ‌గ‌న్ మ‌రో స‌ల‌హాదారును నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. వారిస‌మ‌స్య‌లు విన్నారు. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చర్చెస్‌ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ సంద‌ర్భంగా సీఎం ను కొనియాడారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కూడా హామీ ఇచ్చారు. అదేస‌మ‌యంల ఇకపై క్రిస్టియన్‌ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామ‌ని తేల్చి చెప్పారు. తద్వారా వారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. సో.. ఇదీ క‌థ‌!!