జ‌గ‌న్ ప్ర‌యోగంతో ఎమ్మెల్యేల జేబులు గుల్ల‌వుతున్నాయా…!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌యోగాల‌కు పెద్ద‌పీట వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లోనూ విజ‌యం ద క్కించుకోవాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఇప్ప‌టికే ప్ర‌వేశ పెట్టిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థను బాగానేవాడుకుంటోంది. అయితే.. వీరు ప్ర‌భుత్వం నుంచి గౌర‌వ వేత‌నం రూపంలో ప్ర‌జాధ‌నం తీసుకుంటున్నారు కాబట్టి.. వీరిని సొంత పార్టీ కోసం వినియోగించే అవ‌కాశం లేదు. దీంతో గృహ‌సార‌థుల‌నే కొత్త కాన్సెప్టును తీసుకువ‌చ్చారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ లెక్క‌ల ప్ర‌కారం.. రాష్ట్రంలో 70 శాతం గృహ‌సార‌థుల రిక్రూట్‌మెంట్ పూర్త‌యింది. వీరికి శిక్ష‌ణ త‌ర‌గతులుకూడా ఆ నెల 25 నుంచి ఆయా మండ‌లాల ప‌రిధిలో నిర్వ‌హించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదే శాలు కూడా ఇచ్చారు. వీరికి అయ్యే శిక్ష‌ణ ఖ‌ర్చును పార్టీ ఇస్తుంద‌న్నారు. స‌రే..ఎలాగూ గృహ‌సార‌థుల ల‌క్ష్యం ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించ‌డ‌మే కాబ‌ట్టి.. ఈ ఖ‌ర్చు వారి జేబులోంచే భ‌రించాల్సి ఉంటుంద ని.. తాడేప‌ల్లివ‌ర్గాలు తేల్చి చెప్పాయి.

ఇదిలావుంటే.. ఇంత పెద్ద ఎత్తున గృహ సార‌థుల‌ను నియ‌మిస్తున్నా.. వీరి స‌క్సెస్ రేట్ ఎంత‌? అనేది ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎందుకంటే.. ఖ‌ర్చు చూస్తే .. త‌డిసి మోపెడు అవుతోంది. రోజూ.. 50 ఇళ్ల‌కు తిర‌గాలి. పైగా. ఇద్ద‌రు ఉంటారు. వారికి క‌నీసం టిఫిన్‌, భోజ‌నం, టీ ఖ‌ర్చులైనా ఇవ్వాల‌ని .. పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా..రోజుకు ఇద్ద‌రికీ చెరో .. 200 లేనిదే రారు. ఈ మొత్తం నెల‌కు 12 వేల‌చొప్పున ఎమ్మెల్యేలు పెట్టుకుంటారు.

ఇది కూడా నియోజ‌క‌వ‌ర్గం మొత్తానికి వేసుకుంటే.. దాదాపు ప్ర‌తి నెలా ఎమ్మెల్యే త‌న జేబు నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు తీయాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. మ‌రి.. వీరి ద్వారా వ‌చ్చే ల‌బ్ధి ఎంత‌? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌లంటీర్లు చేసిన ప‌నిలో కొంత వీరు చేస్తారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారు. కానీ, పైకి వైసీపీకి ఓటేస్తామ‌ని చెప్పినా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌జ‌ల మ‌న‌సు మారిపోతే.. అప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది ఎమ్మెల్యేలు సంధిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి దీనిపై అధినేత ఏం చెబుతారో చూడాలి.