క‌న్నా ఎఫెక్ట్‌.. సోము సీటుకు డేంజ‌ర్ బెల్స్‌

బీజేపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ప‌రిణామం క‌న్నా కూట మిలో జోష్ నింపుతోంది. ఇదేస‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు శిబిరంలో మాత్రం మంట‌లు రేపుతోంది. సోము వైఖ‌రి వ‌ల్లే.. క‌న్నా వెళ్లిపోయార‌ని.. కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ‌లం చేకూరే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. క‌న్నా ను బీజేపీలోకి తీసుకున్నప్ప‌టి సంగ‌తిని ప‌రిశీలిస్తే.. ఒకింత ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది.

ఎన్నిక‌ల‌కు ముందు క‌న్నా వైసీపీలోకి చేరాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు సాగుతు న్నాయి. ఇంత‌లోనే కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న ఏపీ బీజేపీ పెద్ద‌లు క‌న్నా విష‌యాన్ని బీజేపీ పెద్ద‌ల‌కు చెప్ప‌డం.. ఆ వెంట‌నే ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకోవ‌డం.. వ‌చ్చీరావ‌డంతోనే.. క‌న్నాను రాష్ట్ర పార్టీ చీఫ్‌ను చేయ‌డం తెలిసిందే. అయితే.. ఈ విష‌యంలో ర‌గిలిపోయిన సోము వీర్రాజు.. త‌న‌కు ఉన్న ఆర్ ఎస్ ఎస్ బంధంతో క‌న్నాకు ఎస‌రు పెట్టార‌నేది క‌న్నా వ‌ర్గం చెబుతున్న మాట‌.

క‌న్నాపై త‌ర‌చుగా ఫిర్యాదు చేయ‌డం.. ఆయ‌నకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయ‌ని.. మ‌న‌సు అక్క‌డే ఉంద‌ని.. ప్ర‌చారం చేయ‌డం వంటివి ద్వారా.. సోము ఒక‌ర‌కంగా.. క‌న్నాను పార్టీకి దూరం చేశారు. ఇక, పార్టీకూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చూప‌డం.. వ‌స్తుంద‌ని అనుకున్న ఒక్క సీటు కూడా రాక‌పోవ‌డం.. వంటి ప‌రిణామాల‌తో క‌న్నాను త‌ప్పించారు. అయితే.. ఇది త‌న విజ‌య‌మేన‌ని భావించిన సోము.. క‌న్నాతో ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగారు.

ఇక‌, ఇప్పుడు.. క‌న్నా బ‌య‌ట‌కువ‌చ్చారు. అయితే.. క‌న్నా వంటిబ‌ల‌మైన నాయ‌కుడిని.. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న నాయ‌కుడిని కోల్పోవ‌డం వ‌ల్ల బీజేపీ న‌ష్ట‌పోయింద‌నే భావ‌న క‌మ‌లం గూటిలో స్ప‌ష్టంగా వినిపిస్తోంది. అందుకే.. ఇప్పుడు సోమును ప‌క్క‌న పెట్టాల‌నే డిమాండ్‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర బీజేపీ నేత‌ల‌కు రాష్ట్ర నేత‌లు ఈమెయిళ్లు..ట్విట్ట‌ర్ల ద్వారా.. త‌మ అభిప్రాయ‌లు పంపించార‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.