బాబు వాళ్ల‌ను మేనేజ్ చేశారా.. వారే మేనేజ్ అయ్యారా… !


గుంటూరు పాలిటిక్స్‌లో ఇదో పెద్ద అద్భుత‌మనే చెప్పాలి. ఎందుకంటే.. విరుద్ధ స్వ‌భావాలు.. భావాలు ఉన్న నాయ‌కులు ఇప్పు డు క‌లిసిపోబోతున్నారు. అంతేకాదు.. క‌త్తులు దూసుకున్న నేత‌లు.. చేతులు క‌ల‌ప‌నున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసు కున్న స్వ‌రాలు.. ఆప్యాయ‌త‌ను కుమ్మ‌రించుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు.. ఇది ఎలా సాధ్య‌మైంది? ఎలా ముందుకు సాగ‌గ‌లుగుతున్నారు? ఎలా సాగుతారు? అనేవి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లుగా ఉన్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ .. టీడీపీ సైకిల్ ఎక్కుతుండ‌డ‌మే…!

రెండు క‌త్తులు ఒకే ఒర‌లో ఇమ‌డ‌డం ఎంత క‌ష్ట‌మో.. అదేవిధంగా ఒక‌ప్పుడు టీడీపీని లేకుండా చేస్తాన‌ని.. టీడీపీ నేత‌లు ఎలా తిరుగుతారో చూస్తాన‌ని స‌వాళ్లు రువ్విన క‌న్నా.. ఇప్పుడు అదే టీడీపీలోకి చేరారు. మ‌రీ ముఖ్యంగా స్థానిక టీడీపీ నేత‌ల‌తో ఏమాత్రం పొస‌గ‌ని.. ముఖ్యంగా ఇటు రాయ‌పాటి నుంచి అటు.. కొమ్మాల‌పాటి వంటి వారితో క‌న్నాకు ద‌శాబ్దాలుగా వైరం ఉంది. అలాంటివారు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. క‌న్నా వ‌చ్చినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బాహాటంగానే ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రి ఇంత‌లా వీరు మారారా? లేక వీరిని చంద్ర‌బాబు మార్చారా? అనేది ఆస‌క్తికర అంశం. దీనిని ప‌రిశీలిస్తే.. వారుకాదు.. చంద్ర బాబే మేనేజ్ చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం త‌ప్ప‌.. చంద్ర‌బాబు కంటికి ఇప్పుడు ఏదీ క‌ని పించ‌డం లేదు. మ‌హాభార‌తంలో అర్జ‌నుడికి చెట్టుపై ఉన్న ప‌క్షి-దాని క‌న్ను.. క‌నిపించిన చందంగానే చంద్ర‌బాబుకు ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్ర‌మే క‌నిపిస్తోంది. అందుకే.. ఎవ‌రు వ‌చ్చినా.. ఎవ‌రు క‌లుస్తామ‌న్నా..ఆయ‌న రెడీగా ఉన్నారు. “ముందు అధికారంలోకి రావాలి. త‌ర్వాత ఏమైనా చేయొచ్చు” అనే పాల‌సీని గ‌తంలో జ‌గ‌న్ అవ‌లంభించారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే పాల‌సీని చంద్ర‌బాబు అవ‌లంభిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌న్నాను పార్టీలోకి ఆహ్వానించే ముందే.. పార్టీ నేత‌ల‌ను అలెర్ట్ చేశార‌ని.. అంద‌రూ మౌనంగా ఉండాల‌ని చెప్పార‌ని గుంటూరులో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. పార్టీని బ‌లోపేతం చేసేందుకు.. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసుకునేందుకు ఉన్న అవ‌కాశాన్ని జార‌విడుచుకోవ‌ద్ద‌ని.. ఆయ‌న కీల‌క నేత‌ల‌కు ఫోన్ల ద్వారా సందేశం ఇచ్చార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే అధినేత మాట‌కు అనుగుణంగా.. నేత‌లు మౌనంగా ఉన్నార‌ని అంటున్నారు. ఇదీ.. సంగతి..!