మురళీధరన్ డైరెక్షన్… రాష్ట్ర నాయకుల యాక్షన్

ఏపీ బీజేపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబిక్కింది. పార్టీ మాజీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీలో చేరిన రోజే కొందరు రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి, తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, చిలుకుపాటి కుమారస్వామి, హనుమంతు ఉదయ్ భాస్కర్ సహా పలు జిల్లాల మాజీ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు తో సహా 30 మంది నేతలు ఢిలీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అయిన కేంద్ర మంత్రి మురళీధరన్‌ను కలిసి తమ వాదనను వినిపించారు.

విచిత్ర వాదన

మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర నేతలు విచిత్రంగా మాట్లాడారు. సోము వీర్రాజును మార్చకపోయినా ఫర్యాలేదని ఆయన వైఖరి మారితే చాలునని, అందరినీ గౌరవించాలని కోరినట్లు చెప్పారు. ఇంతదూరం ఎందుకొచ్చారు.. నేను రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్లం కదా అని మురళీధరన్ వారితో అన్నారట. నాయకత్వ మార్పు తన చేతుల్లో లేదని తేల్చేసిన మురళీధరన్.. తొందరపడ వద్దని సున్నితంగా రాష్ట్ర నేతలను హెచ్చరించారు.

టీడీపీతో పొత్తు వద్దని చెప్పాం..

మాటలో మాటగా టీడీపీతో పొత్తు వద్దని తామె చెప్పినట్లు రాష్ట్ర నేతలు ప్రకటించారు. నిజానికి అదంతా అధిష్టానం డైరక్షన్ అని తెలుస్తోంది. మురళీధరనే ఆ సంగతి ప్రస్తావించి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయని అడిగారట. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో తెలీదు కానీ.. టీడీపీతో పొత్తు వద్దని చెప్పేశారట. చెప్పీ చెప్పకుండా మీడియా ముందు ఈ సంగతి వదలాలని రాష్ట్ర నేతలను మురళీధరన్ ఆదేశించారట. దానితో బయటకు వచ్చిన ఆ నేతలు అదే మాటను ఉన్నది ఉన్నట్లనుగా చెప్పేసి.. చల్లగా జారుకున్నారు. మరి అది బీజేపీ అఫిషియల్ స్టాండా లేక.. అలా వదిలి రియాక్షన్ చూస్తున్నారా తెలియాల్సి ఉంది. దీనిపై టీడీపీ ప్రతిస్పందన ఏమిటో చూడాలి…..