జగన్ కోరుకున్నది ఏబీఎన్ ఆర్కే చేసి పెట్టాడు

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. ఆ ఘర్షణ అంతకంతకూ పెద్దదై ఇరు వర్గాల మధ్య అగాథాన్ని పెంచేలా కనిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఈ చిచ్చుకు కారణం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ అనడంలో మరో మాట లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది వైకాపా నేతలు, కార్యకర్తలు సాధించలేకపోయారు కానీ.. అది రాధాకృష్ణ సాధించి పెట్టారని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమన్నది రాజకీయ పరిశీలకుల మాట. సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. గత విభేదాలన్నీ పక్కన పెట్టి రాష్ట్రం కోసం, తమ ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనిపించారు. కొన్ని నెలల ముందు వరకు సామాజిక మాధ్యామాల్లోనే కాక బయట కూడా తీవ్రంగా విభేదించుకుంటూ, కలహించుకుంటూ ఉన్న ఆ రెండు పార్టీల మద్దతుదారులు.. తమ అధినేతల అభీష్టాన్ని అర్థం చేసుకుని నెమ్మదిగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య దూరం తగ్గుతూ వచ్చింది.

ఇంకొన్ని నెలలు గడిస్తే, పొత్తు అధికారికంగా ఖరారైతే మరింతగా దూరం తగ్గుతుందని.. ఎన్నికల్లో కలిసి మెలిసి పని చేస్తారని అనుకుంటే.. ఇంతలో రాధాకృష్ణ వచ్చి పెద్ద బాంబు వేశారు. మొన్న తొలి పలుకు ఆర్టికల్‌లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చంద్రబాబుతో కలవకుండా.. జగన్‌కు ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని.. ఇందుకోసం పవన్‌కు వెయ్యి కోట్లు ఇవ్వజూపారని ఆయన రాసేశారు. వినడానికి చాలా సిల్లీగా అనిపించే విషయం ఇది. కానీ పవన్ గురించి వైసీపీ వాళ్లు చేసే ‘ప్యాకేజీ’ ఆరోపణలకు బలం చేకూర్చేలా.. పవన్‌ను ఎవ్వరైనా కొనేయొచ్చు అనిపించేలా ఈ వ్యాఖ్యలు ఉండడం జనసైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

పవన్ వ్యక్తిత్వ హననం చేసేలా.. తెలుగుదేశంతో కలవక తప్పని పరిస్థితి కల్పించేలా.. బ్లాక్ మెయిల్ తరహాలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. దీని వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉన్నాడని అనుమానిస్తూ.. తీవ్ర స్థాయిలో ఆయన మీద, తెలుగుదేశం మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. దీనికి బదులుగా తెలుగుదేశం మద్దతుదారులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. పవన్ సైతం ఈ ఆర్టికల్‌తో హర్టయ్యే ఉంటాడని.. పొత్తు మీద పునరాలోచించినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ పొత్తు ఉన్న ఇప్పుడు ఏర్పడ్డ మనస్ఫర్థలతో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసి పని చేయడం కష్టమని.. ఇరు వైపులా ఓట్ల బదిలీ జరగడం కష్టమని.. జగన్ సరిగ్గా ఇదే కోరుకుంటున్నారని.. ఇన్నాళ్లూ జనసైనికులను అదే పనిగా రెచ్చగొడుతూ పొత్తు పొడవకుండా.. పొడిచినా ఓట్ల బదిలీ జరగకుండా చూడాలని వైసీపీ మద్దతుదారులు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదని.. వాళ్ల వల్ల కానిది, జగన్ కోరుకున్నది ఏబీఎన్ రాధాకృష్ణ చేసి పెట్టినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.