ఏపీ పోలీసుల‌కు వార్నింగ్‌ త‌ప్ప‌దా?!

అదేం ఖ‌ర్మ‌మో కానీ.. ఏపీ పోలీసులుకు ఇటు కోర్టుల నుంచి అటు కేంద్రం నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప డం లేదు. అనేక విష‌యాల్లో ఏపీ పోలీసులు అనుస‌రిస్తున్న వైఖ‌రి పై కోర్టులు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. అనేక సంద‌ర్భాల్లో పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌మ వ‌ద్ద‌కు పిలుచుకుని వార్నింగులు కూడా ఇచ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. వారిలో మార్పు మాత్రం రావ‌డం లేదు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌రోసారి ఏపీ పోలీసుల‌కు వార్నింగ్ ఇప్పించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి, బిక్క‌వోలు ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇదేం ఖ‌ర్మ‌ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. దీనికి అనుమ‌తి లేద‌ని.. రోడ్ షోలో ప్ర‌సంగాలు వ‌ద్ద‌ని పోలీసులు నిలువ‌రించారు. ఈ క్ర‌మంలో పెద్ద వివాదమే అయింది. ఇక‌, చంద్ర‌బాబు వెంట‌నే అన‌ప‌ర్తి నుంచి బిక్క‌వోలులోని దేవీ చౌక్ వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. అయితే.. ఆయ‌న జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్నారు. ఈ విష‌యం రాష్ట్ర పోలీసుల‌కు కూడా తెలుసు.

అయిన‌ప్ప‌టికీ.. క‌నీసం ఆయ‌నకు భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోగా.. దిక్కులు చూశారు. ఏడు కిలోమీట‌ర్ల మేర చంద్ర‌బాబు న‌డిస్తే.. ఆ మేర‌కు పోలీసులు క‌నీసం.. భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోగా.. ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకో లేదు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పై ఏదైనా దాడి జ‌రిగి ఉంటే.. ఆయ‌న‌ను ఎవ‌రైనా కొట్టి ఉంటే.. ఇంకేదై నా చేసి ఉంటే.. ఏంటి ప‌రిస్థితి? ఈ ప్ర‌శ్న‌లు ఎవ‌రో టీడీపీ నాయ‌కులు.. చంద్ర‌బాబుఉ అంటే అభిమానం ఉన్న‌వారు.. ఆయ‌న అనుకూల మీడియా వేసినవి కావు.

సాక్షాత్తూ.. చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌గా ఉన్న ఎన్ ఎస్ జీ(నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌) అడిగిన ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌ల‌తోనే వారు కేంద్రంలోని ఎన్ ఎస్ జీ(హోం శాఖ ప‌రిధిలో ఉండే కార్యాల‌యం) అధికారుల‌కు నివేదిక పంపారు. రాష్ట్ర పోలీసుల నిర్వాకాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఇలా అయితే.. మేం ఏం చేయాలి? అని కూడా వారు ప్ర‌శ్నించారు. 30 పేజీల‌తో కూడిన ఈ నివేదిక‌ ప్ర‌స్తుతం కేంద్రానికి చేరింది. దీంతో ఏపీ పోలీసుల‌కు ఈసారి గ‌ట్టివార్నింగ్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు రిటైర్డ్‌ పోలీసు అధికారులు.