అమరావతి రియల్ ఎస్టేట్‌కు మళ్లీ కదలిక

ఏపీ రాజధాని విషయంలో ఇటీవల కేంద్రం ఇచ్చిన స్పష్టతతో పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు వైజాగ్ తరలిపోతామని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయడంతో స్థానికంగా మళ్లీ ఉత్సాహం మొదలైంది. ముఖ్యంగా అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లీ కదలిక మొదలైంది. సుప్రీంకోర్టు కూడా ఈ వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశావహంగా కనిపిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ మధ్యన వెలగపూడి ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేయ డంతో పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. గుంటూరు- విజయవాడ మధ్యన చెన్నై రహదారికి రెండు వైపులా తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు పెద్ద ఎత్తున అపార్టుమెంట్లు.. విల్లాల నిర్మాణం చేపట్టారు.

వందల కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ రియల్‌ వ్యాపారం మొదలు పెట్టిన వ్యాపారవేత్తలు మూడు రాజధానుల ప్రకటనతో పూర్తిగా దెబ్బతిన్నారు.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని భావించిన సమయంలో.. నిర్మాణ సమయంలోనే విల్లాలు, అపార్టుమెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. కొందరు అడ్వాన్సులు కట్టి ఫ్లాట్లు, విల్లాలు బుక్‌ చేసుకున్నారు.

మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయితే మరింత రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాణదారులు ముందస్తు బుకింగ్‌కు ఇష్టం చూపలేదు. ఇక వెంచర్లలో పెద్ద ఎత్తున అడ్వాన్సులు చెల్లించి ప్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వివిధ వర్గాల నుంచి స్పందన పెద్ద ఎత్తున వస్తున్న నేపధ్యంలో..వ్యాపారులు సైతం రైతులతో ఒప్పందం చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు.

ఈ క్రమంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందనే భరోసా రాని స్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన రియల్‌ వ్యాపారుల్లో మళ్లీ ఆశ చిగురించింది.

అప్పులు చేసి మరీ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్నవారు ధరలు తగ్గిపోవడంతో వాటిని ఉంచలేక, వదిలించుకోక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతి మళ్లీ రాజధాని అని కోర్టో, కేంద్రమో చెప్పినా.. టీడీపీ ప్రభుత్వం వచ్చినా పరిస్థితులు మారుతాయని.. మళ్లీ మంచి రోజులొస్తాయని వ్యాపారులు, స్థలాలు కొన్నవారు, ఇల్లు కొన్నవారు ఎదురుచూస్తున్నారు.