లోకేష్ పాదయాత్రను ఆపుతారా.. ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలై పక్షం రోజులు దాటిపోయింది. లోకేష్ ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరు నూరైన 400 రోజుల వరకు యాత్ర నిరాటంకంగా కొనసాగుతుందని లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు యాత్రపై నీలినీడలు అలుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాత్ర కొనసాగించడం అనుమానమేనని వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కోడ్ కూడా అమలులోకి వచ్చింది. దానితో ఇప్పుడు లోకేష్ యాత్ర నిర్వహించే మార్గంలో ఉన్న జిల్లా కలెక్టర్లకు పెద్ద సంకటం వచ్చి పడింది. యాత్రలో హామీలు ఏమైనా ఇస్తే అది కోడ్ ఉల్లంఘన అవుతుందని అనుమానాలు తలెత్తాయి. దానితో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ఇదే అనుమానం వైసీపీ వారి గడప గడపకు కార్యక్రమంపై కూడా రావడంతో క్లారిటీ అడిగారు.

హామీలు ఇవ్వకపోతే చాలా..

యాత్రలపై మరో వాదన తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే ఇలా చేస్తాం, అలా చేస్తామని హామీలు ఇవ్వకపోతే యాత్రలు, గడప గడపకు కార్యక్రమాలతో ఇబ్బంది లేదని కొందరంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే యాత్ర ప్రారంభమైన కారణంగా ఇప్పుడు ఆపాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. యాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిందేనని ఈసీ నిర్ణయిస్తే మాత్రం యువగళాన్ని రెండు నెలల పాటు ఆపాల్సి ఉంటుంది..

వైసీపీ గేమ్ ప్లాన్ ఏమిటి ?

నేల ఈనినట్లుగా పాదయాత్రకు గుంపులు వస్తుంటే, జనం లేరని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశారు. అన్నీ పోలీసుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులే కావడం విశేషం. తాజాగా పాదయాత్ర వలన ఇబ్బందులు ఎదుర్కొంన్నామంటూ కొంతమంది అధికార పార్టీ సానుభూతిపరుల ద్వారా ముందుగా పోలీసులను ఆశ్రయించడం, ఆ తరువాత కోర్టుకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పాటు, రాజధాని రైతుల మాదిరిగా లోకేష్‌ ను కూడా తనంతట తానుగా పాదయాత్ర మానిపించే విధంగా పావులు కదపాలని కొంతమంది వ్యూహకర్తలు ప్లాన్ చేశారని చెబుతున్నారు..