వైసీపీలో మ‌రో ఎమ్మెల్యే రెడీనా?

తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవ‌లే నెల్లూరులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నార‌నేవాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బయటపడ్డాయి. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ మధ్య వర్గపోరు తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది.

వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో నేత‌ల‌ను కూర్చోబెట్టి పంచాయ‌తీ చేయాల‌ని మ‌ర్రి భావించారు. అయితే.. ఈ క్ర‌మంలో ర‌గ‌డ పెద్ద‌దై.. వైసీపీ నేతలు గొడవపడ్డారని తెలిసింది. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత.. మర్రి రాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

అయితే.. మంత్రి జోగి రమేష్ త‌ర‌ఫున మ‌ర్రి వ‌ద్ద‌కు వ‌చ్చిన నాయ‌కులు త‌మ నేత‌పై ఎమ్మెల్యే వ‌సంత చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి దిగారు. దీంతో ఈ పంచాయ‌తీ ఇక ఇప్ప‌ట్లో తెగేది కాద‌ని అంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యే విష‌యానికి వ‌స్తే.. వ‌సంత కొన్నాళ్లుగా పార్టీపై గుస్సాగానే ఉన్నారు. గుంటూరులో జ‌రిగిన తొక్కిస లాట ఘ‌ట‌న‌లో ఎన్నారై ఉయ్యురు శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేయ‌డం(త‌ర్వాత బెయిల్ వ‌చ్చింది) త‌గ‌ద‌ని మీడియా ముఖంగానే చెప్పారు.

అంతేకాదు.. అమ‌రావ‌తిని ఎలా నూ పోగొట్టుకున్నామ‌ని.. ఇప్పుడు సాయం చేసే ఎన్నారైల‌ను కూడా పోగొట్టుకుంటే.. ఎలా అని కూడా ఆయ‌న స్పందించారు. ఈ ప‌రిణామాలను పార్టీ అదిష్టానం తీవ్రంగానే భావిస్తోంది. దీంతో ప్ర‌స్తుతానికి పొమ్మ‌న కుండా.. పొగ పెట్టిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌సంత కూడా త్వ‌ర‌లోనే త‌న దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.