పొంగులేటి.. షర్మిలకు పెద్ద బలమే

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఎర్ఎస్ లో రెబెల్ స్టార్ గా మారారు. ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా ఇప్పుడాయన హాట్ టాపిక్ అయ్యారు. తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు.

వైరా నియోజకవర్గంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో భేటీ అయినందుకు కొందరినీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని వారిని కాదని, తనను సస్పెండ్ చేయాలని పొంగులేటి సవాలు చేస్తున్నారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించడంపై ఆయన మండి పడుతున్నారు. నిజానికి పొంగులేటి చాలా కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

అనుచరులను సిద్ధం చేస్తున్న వైనం

పొంగులేటి ఏ పార్టీలో చేరతారో ఇంకా క్లారిటీ రాలేదు. తొలుత కాంగ్రెస్ అనుకున్నారు. తర్వాత బీజేపీ అని భ్రమ పడ్డారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి అసలు బలం లేకపోవడంతో అక్కడకు వెళ్లి ప్రయోజనం లేదని పొంగులేటి భావించారట. దానితో ఇప్పుడు షర్మిల నేత్వత్వంలోని వైఎస్సార్టీపీ వైపు ఆయన చూస్తున్నారు. వైఎస్ విజయమ్మతో భేటీ తర్వాత పొంగులేటిలో జోష్ పెరిగింది. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తన అనుచరులను సిద్ధం చేస్తున్నారు. నువ్వు ఇక్కడ పోటీ చేయ్, నువ్వు అక్కడ పోటీ చేయ్ అని కొంతమంది అభ్యర్థులకు చెబుతున్నారట. పైగా పోటీ చేస్తే ఖర్చులు మొత్తం తానే చూసుకుంటానని కూడా హామీ ఇస్తున్నారట. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో మాత్రం ఆయన చెప్పడం లేదు..

అభ్యర్థా ? గాడ్ ఫాదరా ?

పొంగులేటి తీరుపై కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా. అలా చేస్తే అసెంబ్లీ బరిలోకి దిగుతారా. లోక్ సభకు పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుచరులు మాత్రం పొంగులేటి పోటీ చేయరని ఆయన గాడ్ ఫాదర్ లా ఉంటూ అందరికీ దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. రాజకీయాలు, కాంట్రాక్టులు రెండూ చూసుకోవాలంటే ప్రజా ప్రతినిధిగా కాకుండా గాడ్ ఫాదర్ లా ఉండాలని ఆయన భావిస్తున్నారు. షర్మిల పార్టీ గెలిచిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టొచ్చు. లేనిపక్షంలో మౌనంగా ఉండొచ్చన్న ఫీలింగ్ ఆయనలో కనిపిస్తోంది…