తమిళిసైని ఏమీ అనలేదట…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కోర్టు జోక్యంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సినిమాటిక్ గా గవర్నర్ రావడం, కేసీఆర్ నమస్కారం చేయడం, తనకు ఇచ్చిన స్క్రిప్టును ఆమె చదివి వెళ్లిపోవడం జరిగిపోయాయి. గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ మొదటి రోజున మసాలా వార్తలు లేక మీడియా కొంత అసంతృప్తి చెందిన మాట వాస్తవం.

గవర్నర్ ప్రసంగంపై కిషన్ రెడ్డి

రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అవాస్తవాలు చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆమెతో అన్నీ అబద్దాలు చెప్పించిందన్నరు. కోర్టుకు భయపడే గవర్నర్ ప్రసంగాన్ని షెడ్యూల్ లో పెట్టారన్న ఆయన… లేని అభివృద్ధిని తమిళిసై ప్రసంగంలో చేర్చారన్నారు. పాడుబడ్డ తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. సర్పంచులకు బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినదీ కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను మళ్లిస్తూ… తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ ప్రసంగంపై విరుచుకుపడ్డారు.

బీజేపీ నేతలే గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపట్టడంపై అన్ని వర్గాల్లో చర్చ జరిగింది. అదేమిటి గవర్నర్ ప్రసంగం లేదని ఇంతకాలం గోల చేసిన కమలనాథులు ఇప్పుడిలా మాట్లాడుతున్నారేమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నించాయి. అయితే అందులో తప్పేముందని బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. స్పీచ్ చదివిందీ గవర్నరే అయినా.. రాసిచ్చిందీ ప్రభుత్వమే కదా అని గుర్తు చేస్తున్నారట. విధాన పరంగా తాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించామని, అందులో గవర్నర్ ను తప్పుపట్టే రాజకీయమేదీ లేదని చెప్పుకుంటున్నారట. పైగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం తమిళిసై పోరాడుతున్నారని, ప్రభుత్వానికి సంబంధం లేకుండా పర్యటనలు చేస్తూ జనంలో ఉంటున్నారని చెబుతున్నారట. బీఆర్ఎస్ నేతలే తమపై కావాలని బురద చల్లేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నది బీజేపీ రాష్ట్ర అగ్రనేతల వాదన.