పెద్దారెడ్ల రూట్లో పేట ఎంపీ ?

నెల్లూరు పెద్ద రెడ్ల అలక అధికార వైసీపీకి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరికొందరు నడుస్తున్న మాట కూడా నిజం. ఆ జాబితాలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు

లావు శ్రీకృష్ణదేవరాయులు, విజ్ణాన్ విద్యా సంస్థల ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే.. పల్నాడు ప్రాంత ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులుకు.. ఆయన పార్లమెంట్ పరిధిలోని చాలామంది ఎమ్మెల్యేలతో సఖ్యత కరువైందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.

ముఖ్యంగా.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతో తొలి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. అలాగే.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితోనూ ఎంపీకి మనస్ఫర్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు పలుమార్లు ఎంపీతో వివాదాలు నెలకొనగా.. పార్టీ పెద్దలు వారికే సపోర్ట్ చేశారు. అంతేకాదు.. విడదల రజనీ మంత్రి అయ్యాక.. ఎంపీకి పార్టీలో ప్రాతినిథ్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.

వినుకొండ సభలో జరిగిందేమిటి ?

పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల సీఎం జగన్‌ పర్యటించారు.అక్కడ జరిగిన పరిణామాలతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పట్ల అధిష్టానం తీరు బహిర్గతమైంది. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయిడి ఫ్లెక్సీల్లో ఎంపీ ఫొటో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. దాంతో.. ఎంపీ- ఎమ్మెల్యే మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు.. జగన్‌రెడ్డి పాల్గొన్న సభలోనూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు అంటీముట్టనట్లుగానే ఉండడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.

వినుకొండ సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసి సీట్లో కూర్చునేందుకు జగన్.. శ్రీకృష్ణదేవరాయులు ముందుగానే వెళ్లారు. ఆ సమయంలో ఆయన్ను పలకరించడం కాదు కదా.. కనీసం ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చర్చకు తావిస్తోంది. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సమయంలోనూ జగన్‌రెడ్డి పక్కన బొల్లా బ్రహ్మానాయుడు ఓ వైపు, మంత్రి విడదల రజనీ మరోవైపు ఉన్నారు. స్థానిక ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయులు మాత్రం సభా వేదిక చివర ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండడం వైసీపీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తోంది. చెక్కులు పంపిణీ చేసేటప్పుడు కనీసం పిలవకపోవడంతో.. చేసేది లేక శ్రీకృష్ణదేవరాయులు సభా వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు.

వైసీపీలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు సరైన ప్రాధాన్యత లేదని.. పార్టీ వీడతారనే ప్రచారం ఎప్పుటినుంచో జరుగుతోంది. దానికి తగ్గట్లే.. వినుకొండ పర్యటన పరిస్థితులు చూసిన తర్వాత.. ఎంపీని జగన్‌.. నిజంగానే పట్టించుకోవడం లేదనే మెసేజ్ వైసీపీ క్యాడర్‌లోకి వెళ్లింది. అలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం ఎందుకనే అభిప్రాయం.. ఎంపీతోపాటు ఆయన సన్నిహితుల్లోనూ వ్యక్తం అవుతోంది. గౌరవ మర్యాదలు లేని చోట ఉండటం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.