ఏపీలో ఒక ముస‌లి నేత ఉన్నారు.. జ‌గ‌న్ సెటైర్లు!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై స‌టైర్లు రువ్వారు. రాష్ట్రంలో ఒక ముస‌లి నేత ఉన్నారంటూ.. చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ” సీఎంగా ఓ ముసలాయాన (చంద్రబాబు) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించలేదు. దోచుకోవడం గురించే ఆలోచించింది. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు(ప‌వ‌న్‌) ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు” అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. జగనన్న చేదోడు పథకం కింద ఎంపిక చేసిన‌ లబ్ధిదారుల ఖాతాల్లో 10 వేల రూపాయ‌ల చొప్పున బ‌ట‌న్ నొక్కి నగదు జమ చేశారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా వారికి 10వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీనికి సంబంధించి వ‌రుస‌గా మూడో ఏడాది జగనన్న చేదోడు నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 30 వేల 145 మంది అర్హులైన ల‌బ్ధిదారుల‌కు 3 వంద‌ల 30 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తోంద‌ని తెలిపారు. వ‌రుస‌గా మూడో ఏడాది కూడా జ‌గ‌న‌న్న చేదోడు ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా వృత్తిదారుల‌కు మేలు జ‌రుగుతోంద‌ని అన్నారు. నిరుపేద కుటుంబాల‌కు న్యాయం చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. “దోపిడీ పాలన కావాలా? లంచం, అవినీతి లేని పాలన కావాలా? జాగ్రత్తగా ఆలోచించుకుని ఎంచుకోండి. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయని” అని జ‌గ‌న్ అన్నారు.

అంతేకాదు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో చేసి చూపించామ‌న్నారు. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామ‌న్నారు. వివక్ష లేకుండా పారదర్శకంగా భరోసా అందిస్తున్నామ‌ని చెప్పారు.

దేశంలోనే జీడీపీ జీఎస్‌డీపీ(గ్రాస్‌ స్టేట్‌ డెమోస్టిక్‌ ప్రొడక్ట్‌) ప్రకారం.. ఏపీ గ్రోత్‌ రేట్‌ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జ‌గ‌న్ తెలిపారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే.. ఇలాంటి ఫలితం సాధ్యమవుతుందన్నారు. “ఏపీ శ్రీలంక అయిపోతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఏపీ దేశానికే ఓ దిక్సూచిలా నిలుస్తోంది. ” అని జ‌గన్ వ్యాఖ్యానించారు.