సీఎం అభ్యర్థి పేరుతో వైసీపీ మైండ్ గేమ్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికివెళ్లినా జనం ఛీ కొడుతున్నారు. ఏం చేశావంటూ నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోతున్నారు. ఆ జనమంతా ఇప్పుడు విపక్షం వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు ఓటేస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు. విపక్షాలు కూడా ఐక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చాయి. పైగా ఇప్పుడు యువగళం యాత్రకు భారీగా ప్రజా స్పందన వస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే వారాహి యాత్రకు కూడా అదే రేంజ్ లో మద్దతు లభిస్తుందని విశ్వసిస్తున్నారు. దానితో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం గేమ్ ప్లాన్ మార్చింది. ముఖ్యమంత్రి ఎవరూ అంటూ నోటి మాటగానూ, తమ సోషల్ మీడియా ద్వారాను విస్తృత ప్రచారం చేస్తోంది..

వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అయితే విపక్షాల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ కొత్త క్యాంపైన్ మొదలైంది. యాత్ర చేస్తున్న లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థా లేక హైదరాబాద్లో కూర్చున్న టీడీపీ అభ్యర్థి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థా తేల్చాలని ప్రశ్నలు వేస్తున్నారు. పైగా చంద్రబాబుకు ఇంటి పోరు పెరిగిపోయిందని మరో వాదనను తెరమీదకు తెచ్చారు.

లోకేష్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని గతంలోనే ఆయన తల్లీ, భార్య పట్టుబట్టారని ఇప్పుడు యువగళం యాత్ర ప్రారంభమైన వేళ ఆ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చిందని వైసీపీ బ్యాచ్ మౌత్ పబ్లిసిటీ మొదలెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ను ఇప్పుడే ప్రకటించకపోతే ఇంట్లో గొడవలు పెరిగిపోతాయన్న దుష్ప్రచారం కూడా ఊపందుకుంది. నిజానికి యాత్రకు ముందే లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. యాత్రలో కూడా పదే పదే అదే మాట చెబుతున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని లోకేష్ చెబుతూ వస్తున్నారు. జనానికి ఆ సంగతి బాగానే అర్థమైనా.. వైసీపీ ప్రచారకులకు మాత్రం ఎక్కడం లేదు.

ఇప్పుడు మరో ప్రచారానికి కూడా తెరతీశారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబుపై వత్తిడి పెరుగుతోందన్నది వారి వాదన. జససేనానిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే పొత్తు పొడుస్తుందని లేనిపక్షంలో ఓడిపోతారని బాబును భయపెడుతున్నట్లు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. దీనితో పవన్ కల్యాణ్ బెట్టు చేస్తున్నారని, చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని కూడా చెప్పుకొస్తున్నారు. అందుకే పొత్తు చర్చలు ముందుకు సాగడం లేదని, రెండు పార్టీల శ్రేణులకు దిక్కుతోచటం లేదని అక్కడక్కడా చెబుతున్నారు.

ఈ ప్రచారాలు టీడీపీ నేతలకు చేరడంతో వాళ్లు గట్టి కౌంటర్ మొదలు పెట్టారు. ముమ్మాటికి చంద్రబాబే సీఎం అవుతారని కుండబద్దలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, తమ పొత్తు అధికారానికి రావడం ఖాయమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రజారంజక పాలన అందిస్తారని పుల్లారావు చెబుతున్నారు….