కసితీరా మాట్లాడిన తమిళిసై

మేడమ్ సార్ కి చాలా రోజుల నుంచి తెలంగాణ సీఎం అంటే ఆగ్రహం. ఇరగదీద్దామన్న ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె మౌనం వహిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి తన మంచితనాన్ని చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యల్లో భాగంగా ఫైళ్లు తొక్కిపెడతారు. ఇప్పటికే ఏడెనిమిది పైళ్లు రాజ్ భవన్లో చెదలు పట్టుకుని ఉన్నాయి. ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌదరరాజన్.

రిపబ్లిక్ దినోత్సవం రోజున తమిళిసైకి ఒక అవకాశం వచ్చింది. రాజ్యాంగ నిబంధనపనల ప్రకారం వేడుకలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత ఆమెకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సమక్షంలోనే ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరికి తాను నచ్చకపోవచ్చని, అయినా తెలంగాణ కోసం పనిచేయడమే తన ధ్యేయమని ఆమె చెప్పుకున్నారు. “కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు – నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం – రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను.” అంటూ తమిళిసై అటాకింగ్ మూడ్ లో ప్రసంగాన్ని కొనసాగించారు.

గిరిజన ప్రాంతాల్లో రాజ్ భవన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఆమె చెప్పుకున్నారు. వైద్యం, ఐటీ రంగంలో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాలకు మోదీ వందే భారత్ రైలును కేటాయించిన సంగతిని కూడా తమిళిసై ప్రస్తావించారు..

తమిళిసై తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసి మూడున్నరేళ్లు కావస్తోంది. మొదటి ఏడాదిన్నర కేసీఆర్ సర్కారుతో ఆమెకు ఎలాంటి పేచీ లేదు. తర్వాతే సంఘర్షణ మొదలైంది. ఏదోక సాకు చెప్పి ఫైళ్లపై సంతకాలు పెట్టకుండా ఆమె ఆపేస్తూ ఉన్నారు. పొడిగింపు ఇవ్వకపోతే ఆమె మరో ఏడాదిన్నర తెలంగాణ రాజ్ భవన్లో కొనసాగుతారు. అప్పటి వరకు ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పలేం…

తమిళిసై తీరుపై తమిళనాడులో కూడా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో తమిళనాడు బీజేపీ శాఖాధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె కొంతకాలం క్రితం డీఎంకేను విమర్శించేందుకు ప్రయత్నించారు. మాటా మాటా పెరిగింది. డీఎంకే నేతలంతా తెలుగోళ్లు అన్నట్లుగా ఆమె ఒక థియరీ బయటకు తీశారు. దానితో ఎవరు తమిళులో తేల్చుకుందా రమ్మంటూ డీఎంకే సవాలు చేసింది. తెలంగాణలో ఆమె తెలుగు స్పీచులు ఇస్తున్నారని గుర్తుచేసింది. దానితో ఆమె డీఎంకే జోలికి వెళ్లడం మానేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాత్రం విరుచుకుపడుతున్నారు…