మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

అదేస‌మ‌యంలో టీడీపీ ఆయా స్థానాల‌ను కోల్పోయింది. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ‌ను కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే, గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ.. మ‌రోసారి మైనారిటీ వ‌ర్గాల ఓట్ల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప నుంచి గెలిచిన మైనారిటీ నాయ‌కుడు అంజాద్ బాషాకు రెండు సార్లు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైనారిటీ వ‌ర్గం ఎటు మ‌ళ్లుతుంది? అనేది ప్ర‌శ్న‌గా మారింది ఎందుకంటే.. మైనారిటీ వ‌ర్గంలో అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో మైనార్టీల‌కు వారు స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా అధిష్టానం వైఖ‌రిపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాను వైసీపీకి న‌మ్మిన బంటున‌ని చెప్పుకొనే ఆయ‌న‌కు క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న కుమార్తెకు టికెట్ ప్ర‌క‌టించేసుకున్నారు. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైనారిటీల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా చేసింది ఏమీ లేద‌ని.. ఇటీవల క‌ర్నూలులో ఈ వ‌ర్గం ముస్లింలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి మైనారిటీలు దూర‌మ‌వుతున్నార‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.