రోడ్‌షోలపై నిషేధం.. లోకేశ్, పవన్ యాత్రలు ఆపేందుకేనా?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్ షోలు, రోడ్లపై సభలు.. ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు వేటిపైన కానీ… రోడ్ మార్జిన్లలో కానీ సభలు, ర్యాలీలకు అనుమతించరాదని ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అయితే… ప్రత్యేక సందర్భాలలో జిల్లా ఎస్పీలు కానీ పోలీస్ కమిషనర్లు కానీ షరతులతో అనుమతులు ఇవ్వొచ్చంటూ మినహాయింపులు ఇచ్చింది. 1861 పోలీస్ యాక్ట్ ప్రకారం ఏపీ హోం శాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఈ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లకు దూరంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరైన ప్రదేశాలలో సభలు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు చంద్రబాబు ర్యాలీలను అడ్డుకోవడానికి మాత్రమే కాదని… త్వరలో ప్రారంభం కాబోయే లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలను అడ్డుకునేందుకు కూడా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర జనవరి 27 నుంచి మొదలుకానుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన తన పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తన వారాహి వాహనంలో ఏపీలోని 100 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఈ రెండు యాత్రలూ రోడ్లపై సాగాల్సినవే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే, ఇటీవల గుంటూరు, కందుకూరులలో చంద్రబాబు కార్యక్రమాలలో తొక్కిసలాటలు జరగడంతో ప్రభుత్వానికి ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం చిక్కింది. పంచాయతీ రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకు ఎక్కడా ర్యాలీలకు అవకాశం లేకుండా చట్టం అమలు చేయనుండడంతో లోకేశ్, పవన్ యాత్రలకు భారీ అవాంతరం ఎదురైనట్లే చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, జనసేనలు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

మరోవైపు లోకేశ్, పవన్ యాత్రలను అడ్డుకునేందుకు గాను ఇలాంటి ఆదేశాలు తేవడానికి వీలుగానే కుట్రపూరితంగా చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలకు దారితీసేలా ఎవరైనా కుట్రలు పన్నారా అనే అనుమానాలు టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు షరతుల కూడిన అనుమతులు, ప్రత్యేక సందర్భాలలో అనుమతులు అని పేర్కొనడంతో వైసీపీ నేతల రోడ్ షోలకు, సభలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్తున్నారు.