ఏపీ కాపులకు నాయకుడెవ్వరో..?

ఆంధ్రప్రదేశ్ కాపులకు ఇప్పుడు లీడరెవ్వరన్న ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది, రాజకీయ కురు వృద్ధుడైన హరిరామ జోగయ్య… కాపుల రిజర్వేషన్ కోసం దీక్షకు పూసుకున్న తర్వాత ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా కాపు నాయకులు వేర్వేరు పార్టీల్లో సెటిల్ కావడంతో పాటు అందరూ ఒక టాటిపైకి రాకపోవడంతో కాపుల్లో నాయకత్వ లోపం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. అంగబలం, అర్థబలం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించుకోవడంలోనూ విఫలమవుతున్నారు….

పవన్ కల్యాణ్ పరిస్థితేమిటి ?

జనసేనాని పవన్ కల్యాణ్… కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తాను కాపు నాయకుడినని చెప్పుకునేందుకు ఆయన వెనుకాడతారు. రాజకీయాల్లో రాణించాలన్నా, ముఖ్యమంత్రి పదవిపై కన్నేయ్యాలన్నా అన్ని వర్గాలను కలుపుకుపోవాల్సిన అనివార్యత ఆయనపై ఉందంటారు. కాపుల హక్కుల గురించి పవన్ అప్పుడప్పుడు మాట్లాడినా అందరూ తన నాయకత్వంలో పనిచేయాలని ఆయన ఎప్పుడూ పిలుపునివ్వరు. పైగా వైసీపీ కాపు నాయకులైన పేర్ని నాని, అంబటి రాంబాబు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కల్యాణ్ ను తిడుతూ ఆ సామాజిక వర్గంలోని అనైక్యతను చాటుతుంటారు. పైగా కాపుల ఓట్లు చీలిపోవడం వల్ల గత ఎన్నికల్లో పవన్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఆయనే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు.

ఆ ముగ్గురి మీటింగ్ ఏమైంది ?

కొంత కాలం క్రితం ముగ్గురు కాపు నేతలు మీటింగ్ పెట్టుకున్నారు. టీడీపీలో ఉండే బోండా ఉమ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఓ రోజు సాయంత్రం పూట భోజనానికి కలిశారు. కాపులు ఎలా ముందుకు సాగాలో చర్చించారు.రాజకీయ సమావేశం కాదని మీడియా ముందు చెప్పినా.. వాళ్లు ఏదో మాట్లాడుకున్నారని, కార్యాచరణ సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. చవరకు జరిగిందేమీ లేదు…

అప్పుడప్పుడు గుర్తుకొచ్చే రంగా…

కాపు నాయకత్వం కోసం పోరాడే వారికి అప్పుడప్పుడు వంగవీటి మోహన రంగారావు గుర్తుకొస్తుంటారు. ఆయన కుమారుడు వంగవీటి రాధాను దువ్వుతుంటారు. రాధా కూడా ఎన్నికల్లో ఓడిపోతున్నారంటే కాపుల్లో ఐక్యతాలోపం అర్థం చేసుకోవచ్చు. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నా…. ఆయన్ను దువ్వేందుకు వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన మాత్రం ఫైనల్ డెసిషన్ చెప్పలేదు..

బీజేపీ కాపుల సంగతేంటి ?

రెండు ప్రధాన పార్టీల్లో ఇమడలేని కాపులు.. బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ చాలా రోజుల క్రితం వినిపించింది. పవన్ కల్యాణ్ పై కూడా నమ్మకం లేని కాపు ప్రజలు కమలానికి జై కొడతారని అనుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖకు వరుసగా కాపు నేతలే అధ్యక్షులవుతున్నారు. ప్రస్తుతమున్న సోము వీర్రాజు కూడా కాపేనని మరిచిపోకూడదు. ఎన్నికల్లో మాత్రం ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో కాపులకు సోము వీర్రాజు నాయకత్వంపై నమ్మకం లేదనిపించింది..

యువత ముందుకు రావాలి…

కాపు నాయకులు ఒక డైలాగ్ గుర్తు చేసుకోవాలి. సమయం లేదు మిత్రమా అనుకోవాలి. కాపు యువతలో రాజకీయ చైతన్యం అవసరం. ఒక శక్తిమంతుతైన నాయకుడిని గుర్తించి అతని కింద పనిచేస్తూ.. రాజ్యాధికారం కోసం పాటుపడాలి. లేని పక్షంలో రిజర్వేషన్ దీక్ష పేరుతో హరిరామజోగయ్య లాంటి పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. పైగా జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లో చేరుతున్నారు. దాని పర్యవసానాలు కాపులే ఆలోచించుకోవాలి…