ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 10 లక్షల కోట్లు

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డులను దాటి పోతోంది. పాత అప్పులు తీర్చలేకపోగా, సరికొత్త అప్పులు చేస్తూ.. జనాన్ని రుణగ్రస్తులను చేస్తోంది. ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయక తప్పడం లేదు.

జగన్ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి ఏపీకి రూ.3,62,375 కోట్ల అప్పులున్నాయి. గత మూడేళ్లలో వైసీపీ సర్కారు మరో రూ. 6,37,064 కోట్ల అప్పు చేసింది. అంటే ప్రస్తుతం ఏపీ అప్పులు రూ. 9,99,439 కోట్లన్నమాట. ఇంకో రూ. 561 కోట్లు అప్పు చేస్తే అక్షరాలా రూ.10 లక్షల కోట్లు అప్పు అవుతుంది. ఈ గణాంకాలను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన జీవీ రెడ్డి విడుదల చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు మరో వారం రోజుల్లోపే అది కూడా పూర్తయి… పది లక్షల కోట్ల చెత్త రికార్డును అధిగమించే అవకాశాలున్నాయి.

వైసీపీ మూడేళ్ల పాలనలో రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు రూ. 2,08,759 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 5,952 కోట్లు తీసుకున్నారు. కార్పొరేషన్ల అప్పు రూ. 80,603 కోట్లు, ఆస్తులు తాకట్టు పెట్టి రూ. 87,233 కోట్లు పొందారు. అవి కాకుండా మద్యం ఆదాయాన్ని ముందే తకట్టు పెట్టి రూ. 8,305 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అలా అందిన కాడికి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ లో నెట్టుకొస్తోంది. ఇలా ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయటపడటం కొన్ని గంటల్లోనే మళ్లీ ఓడీలోకి వెళ్లిపోవడం జరుగుతోంది. ఒక త్రైమాసికంలో 36 రోజులకు మించి ఓడీలో ఉండటానికి వీల్లేని పరిస్థితుల్లో ఏం చేస్తోందా చూడాలి. ప్రస్తుత త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులు ఓడీలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబరు నెలలోనే 14 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ తో నెట్టుకొచ్చింది. ఇదిలా ఉండగా కొత్త అప్పుల కోసం జగన్ సర్కారు దొంగలెక్కలు చెబుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి, కేంద్రాన్ని తప్పుతోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు..