అబ్బా…! ఏం ప్లాన్ వేశావ్ కన్నా… ?!

కన్నా లక్ష్మీ నారాయణ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెద కూరపాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయన్ను ఓటర్లు నిత్యం గుర్తు చేసుకుంటారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఆయన సేవలను ప్రస్తావిస్తుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పుకున్నారు. ఆ అవకాశం చేజారిన తర్వాత రాజకీయాల్లో కన్నా కొంచెం నిదానించినట్లే కనిపిస్తోంది. విభజన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ ను వీడిన కన్నా… వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. అయితే బీజేపీలో చేరారు. ఇప్పుడు కమలం పార్టీ అసంతృప్తిపరులకు ఆయన నాయకుడిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత కన్నా.. పార్టీకి కూడా కొంచెం దూరం జరిగారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు…వీర్రాజుపై ఆయన డైరెక్టుగానే విరుచుకుపడ్డారు…

అయితే అలా… కాకపోతే ఇలా…

కన్నా, బీజేపీ నుంచి బయటకు వస్తారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. సామాజిక వర్గాల లెక్కలు వేసే కొందరు విశ్లేషకులు ఆయన జనసేన వైపుకు వెళ్తారని చెప్పారు. ఇప్పుడు వారి మాటే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనలో నెంబరు టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తన బృందంతో వెళ్లి కన్నాను కలుసుకోవడం, 40 నిమిషాల పాటు చర్చలు జరపడం పార్టీ మారతారన్న వాదనకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. కన్నా ఇంట్లోనే జరిగిన భేటీ సందర్భంగా ఎన్నికల్లో పోటీ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ జనసేన పొత్తు ఉంటే..కన్నా కమలం పార్టీలో కొనసాగుతూ జనసేనకు మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ మాటగా మనోహర్ చెప్పారట. పొత్తు కుదరక ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం బీజేపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ఆహ్వానించారట. అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా కోరుకున్న నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పారట. కన్నా మాత్రం గుంటూరు నగరంలోనే పోటీ చేయాలనుకుంటున్నారు.. దానితో నాదెండ్ల మనోహర్ ప్రతిపాదన కన్నాకు బాగా నచ్చేసిందట. సరే అలాగే చేద్దామని చెబుతూ కాఫీ ఇచ్చి పంపించారట. బీజేపీలో సోము వీర్రాజు వ్యతిరేకులకు ప్రస్తుత పరిణామాలు కొత్త కిక్కునిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి….

తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం..

2009 తర్వాత కన్నా ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. కన్నా మంత్రిగా చేసిన రోజుల్లో ఆయన తనయుడు నాగరాజు గుంటూరు మేయర్ గా ఉండేవారు. తండ్రీ కొడుకులు జిల్లాను ఏలేస్తున్నారన్న ప్రచారం ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో వీక్ అయిపోయిన తర్వాత కన్నా కుటుంబం కూడా రాజకీయాల్లో అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలన్న ఆరాటం వారిలో కనిపిస్తోంది. ఇకపై తాను వేయబోయే రాజకీయ అడుగులు తనకంటే తన కుమారుడు కన్నా నాగరాజు రాజకీయ భవితవ్యానికి ఉపయోగపడతాయని లక్ష్మి నారాయణ అంటున్నారట…. చూడాలి..