ఒంట‌రి పోరులో ఓట‌మి ఆహ్వానాలు!!

నిజ‌మే.. ఎవ‌రు ఒంట‌రిగా పోటీ చేసినా.. ఏపీలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం క‌ష్టం! వైసీపీ అయినా.. జ‌న‌సేన అయినా.. టీడీపీ అయినా.. అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌లు హాట్ అనే ప్ర‌చారం ఉంది. దీంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మార్పులు అత్యంత ఆవ‌శ్య‌మ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తానంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గ‌త కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జ‌ర‌గాలంటే.. అన్ని పార్టీలు క‌లిసి తీరాలి. కానీ, ప‌వ‌న్ మాత్రం ఒంట‌రిపోరుకే రెడీ అంటూ.. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోనూ.. మంగ‌ళ‌గిరిలోనూ సంకేతాలు ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని.. జ‌న‌సేన అధికారంలోకి రాగానే వైసీపీ నేత‌లను త‌రిమితరిమి కొడ‌తామ‌ని అన్నారు.

కానీ, ఒంట‌రి పోరుతో సాధ్యం కాదు. ఇక‌, టీడీపీని తీసుకున్నా.. ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చాలా జిల్లాల్లో పార్టీనేత‌ల మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు… పూర్తిస్థాయిలోఒంట‌రిగా గెలుపు గుర్రం ఎక్కే రేంజ్‌లో అయితే.. మెజారిటీని అందించ‌లేవు. సో.. పొత్తులు త‌ప్ప‌వు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. పైకి ఒంట‌రిగా.. పోటీ చేస్తున్నా.. తెర‌చాటున అటు తెలంగాణ అధికార పార్టీతోనో.. కేంద్రంలోని పెద్ద‌ల‌తోనో.. పోటీ చేయాల్సిందే. అంటే.. మొత్తంగా ఏపీలో ఏ పార్టీ కూడా ఒంట‌రిగా బ‌రిలో దిగే ప‌రిస్థితి లేదు. ఇలా దిగితే.. ఓట‌మిని ఆహ్వానించేన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.