నారా లోకేష్‌.. పాద‌యాత్ర టాస్క్ ఇదే!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర ప్రారంబిస్తున్నారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ పాద‌యాత్ర ఘ‌నంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాల‌ను క‌లుపుతూ.. ఈ పాద‌యాత్ర‌ను ప్లాన్ చేసుకున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం దీనిలో ప్ర‌ధాన ల‌క్ష్యంగా లోకేష్ 4000 కిలో మీట‌ర్లు, 400 రోజుల పాటు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ దాదాపు ఖ‌రారైంది.

ఒక‌వైపు పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు, అదేస‌మ‌యంలో వైసీపీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం లోకేష్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ తాలూకు ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. వైసీపీ ప్ర‌భుత్వం వాటిని ఎలా తొలగించిందో.. దీని వ‌ల్ల న‌ష్టాలేంటో, పేద‌లు ఎంత ఇబ్బందులు ప‌డుతున్నారో.. చెప్పేందుకు ఈ పాద‌యాత్ర‌ను నారా లోకేష్ వినియోగించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో గ్రామ‌స్థాయిలో చెదిరిపోయిన ఓటు బ్యాంకును తిరిగి గాడిలో పెట్టేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నించ‌నున్నారు.

అంతేకాదు.. పాద‌యాత్ర ద్వారా.. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న పార్టీ కీల‌క నేత‌ల‌ మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు.. వివాదాల‌ను కూడా ప‌రిష్క‌రించాల‌ని లోకేష్ భావిస్తున్నారు. త‌మ్ముళ్ల‌ను చైత‌న్యం చేయ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించ‌డం, చంద్ర‌బాబు అసెంబ్లీలో చేసిన శ‌ప‌థాన్ని గుర్తు చేయ‌డం లోకేష్‌కు ఇప్పుడు కీల‌క ల‌క్ష్యంగా ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేసి.. చ‌ర్య‌ల‌పై కూడా ఆయ‌న దిశానిర్దేశం చేయ‌నున్నారు.

అయితే, ఇదే స‌మ‌యంలో.. లోకేష్‌కు ఒక పెద్ద స‌మ‌స్య మాత్రం వెంటాడుతూనే ఉంది. అది త‌మ్ముళ్ల త‌గువులు. పైకి అంద‌రూ బాగానే ఉన్నార‌ని క‌నిపిస్తున్నా.. అంత‌ర్గ‌తంగా నేత‌లు.. రగిలిపోతున్నారు. ఆధిప‌త్య పోరు.. టికెట్ ర‌గ‌డ తారా స్థాయిలో ఉంది. ముఖ్యంగా వార‌సులు ఎక్కువ‌గా టికెట్లు ఆశిస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో నారా లోకేష్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? ఏవిధంగా పార్టీ నేత‌ల‌ను లైన్‌లో పెడ‌తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనేక సార్టు నేత‌ల‌కు చెప్పి చూశారు. మారాలంటూ క్లాసులు కూడా ఇచ్చారు. అనేక కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌లను క‌లుసుకోవాల‌ని వారికి దిశానిర్దేశం చేశారు. ఇలా ఎన్ని వ్యూహాలు ప‌న్నినా.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త సాధించ‌లేక పోయారు. కేవ‌లం చంద్ర‌బాబు వ‌స్తే త‌ప్ప‌.. నేత‌లు క‌దిలే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో లోకేష్ పాద‌యాత్ర‌, ఆయ‌న అనుస‌రించ‌నున్న వ్యూహానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.