షర్మిల దెబ్బకు కుర్చీ కదిలిన సీనియర్ పోలీసు అధికారి..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దెబ్బకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కుర్చీ కదిలిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన పాదయాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న తరుణ్ జోషిని ఆకస్మికంగా బదిలీ కావటం.. ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమని చెప్పటం తెలిసిందే. సమర్థుడైన అధికారిగా పేరున్న తరుణ్ జోషికి ఉన్నట్లుండి.. ఆయన ఒక్కరి మీదనే బదిలీ వేటు పడటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆమె కాన్వాయ్ మీదా.. ఆమె కారవాన్ మీదా జరిగిన దాడి.. తదనంతరం చోటు చేసుకున్నపరిణామాలు తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మార్చాయని చెబుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన రచ్చకు వరంగల్ లో చోటు చేసుకున్న పరిణామాలే కారణంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న రంగనాథ్ ను వరంగల్ పోలీసు కమిషనర్ గా బదిలీ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఐజీ హోదా పొందిన తరుణ్ జోషి బదిలీ మీద హైదరాబాద్ కు వెళ్లిపోతారన్న ప్రచారం జరిగినప్పటికి.. ఆయన వరంగల్ పోలీసు కమిషనర్ గా దాదాపు పదకొండు నెలల పాటు ఆ పోస్టులో సాగటం తెలిసిందే. విధి నిర్వహణలో ఆయనకు ఎలాంటి రిమార్కు లేదని చెబుతారు. అలాంటి అధికారిని ఆకస్మికంగా బదిలీ చేయటం.. ఆయన్ను తప్పించి మరెవరినీ బదిలీ చేయకపోవటాన్ని చూస్తే.. ఆయన ట్రాన్సఫర్ వెనుక షర్మిల ఎఫెక్టు కచ్ఛితంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ నెలలో డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ నేపథ్యంలో కొన్ని బదిలీలు ఖాయమని అంచనా వేస్తున్నారు. కొత్త డీజీ రావటం.. అందుకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని భావిస్తున్న వేళ.. తరుణ్ జోషిని బదిలీ చేయటం పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎవరు అవునన్నా.. కాదన్నా షర్మిల ఎఫెక్టు ఆయన బదిలీ మీద ఉందని ఖాయంగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షర్మిల కాన్వాయ్ మీద జరిగిన దాడితో పోలిస్తే.. హైదరాబాద్ లో ఆమె కారులో ఉండగానే టోయింగ్ వాహనంతో ఆమె కారును లాక్కెళ్లిన విషయంలోనే షర్మిలకు ఎక్కువ మైలేజీ రావటంతో పాటు.. ఆమె మీద సానుభూతి పెరిగిందన్న మాట వినిపిస్తోంది.

అలాంటి వేళ.. తరుణ్ జోషి కంటే కూడా.. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న రంగనాథ్ మీదనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఆయన్ను తరుణ్ జోషి ప్లేస్ లోకి రీప్లేస్ చేయటం చూస్తే.. హైదరాబాద్ ఎపిసోడ్ కంటే కూడా వరంగల్ లో చోటు చేసుకున్న పరిణామాలకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక.. బదిలీ జరిగిన తరుణ్ జోషిని.. సినిమాటిక్ గా సిబ్బంది వీడ్కోలు పలికారు. చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా పలువురు ఆఫీసర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలతో అలంకరించిన జీపులో ఆయన నిలిచి ఉంటే.. ఆ వాహనానికి తాడు కట్టి.. సిబ్బంది లాగటం.. ఆయనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా అరుదుగా కొందరు అధికారుల విషయంలోనే ఇలాంటి వీడ్కోలు ఉంటుందని చెబుతున్నారు.