ఒకే మీటింగులో ఆ ఇద్దరూ.. పలుకరించుకుంటారా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిసెంబరు 5 ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోందన్న చర్చ మొదలైంది. ఎదురు పడే సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలతాయా అన్న ఆలోచన కొందరి మదిలో మెదులుతోంది. జీ – 20 సలహాల సమావేశంలో టీ-20 మ్యాచ్ జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

జీ-20 దేశాల సదస్సుకు భారత ప్రభుత్వం అధ్యక్షత వహించబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో న్యూఢిల్లీ వేదికగా 18వ వార్షిక జీ-20 సదస్సు జరుగుతుంది. అప్పుడు మన దేశం వహించాల్సిన వైఖరిపై ప్రధాన పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రైమ్ మినిష్టర్ మోదీ నిర్ణయించారు. అందుకోసం నిర్వహించే సమావేశానికి ప్రధాన పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు.

రాష్ట్రపతి భవన్లో డిసెంబరు 5 సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే సదస్సులో దేశంలో అన్ని పెద్దల పార్టీల నేతలు పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. మోదీ పిలిచిన తర్వాత జగన్ వెళ్లకుండా ఉంటారా. జగన్, చంద్రబాబు ఓకే హాల్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందన్న చర్చ ఏపీలో జోరుగాసాగుంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటారని కొందరు.. మొహానికి నవ్వు పులుముకుని మొక్కుబడిగా పలుకరించుకుంటారని మరికొందరు వాదిస్తున్నారు. ఏపీ వేరు, ఢిల్లీ వేరని.. అక్కడ ఇద్దరూ నేతలు స్నేహంగానే మాట్లాడుకుంటారని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దుష్టచతుష్టయం, బై బై బాబు లాంటి నినాదాలను వైసీపీ బాగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎదురుపడినప్పుడు నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి…

నిజానికి స్వాతంత్ర దినోత్సవం రోజున ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్, చంద్రబాబు హాజరయ్యారు.. ఇద్దరూ ఎదురు పడతారని భావించారు. అందుకు భిన్నంగా ముందు చంద్రబాబు వచ్చి మర్యాదపూర్వకంగా కాసేపు ఉండి వెళ్లిపోయారు. తర్వాతే జగన్ అక్కడకు చేరుకున్నారు. దానితో ఇద్దరు నేతలు కలిసే అవకాశం రాలేదు. ఢిల్లీలో అలా జరగకపోవచ్చు..