500 కిలోల గంజాయి.. ఎలుక‌లు తినేశాయి..

వినేవాడు ఉంటే.. చెప్పేవాడు.. అన్న‌ట్టుగా ఉత్త‌రప్ర‌దేశ్ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా మ‌ధుర జిల్లా పోలీసులు కోర్టుకు ఒక నివేదిక స‌మ‌ర్పించారు. దీనిలో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాన్ని.. ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అదేంటంటే.. తాము స్వాధీనం చేసుకున్న 500 కిలోల గంజాయిని.. స్టేష‌న్‌లో ఎలుక‌లు తినేశాయ‌ని!! చిత్రంగా ఉన్నా ఇది నిజం.

ఏం జ‌రిగిందంటే..

మథుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (1985) ప్ర‌కారం.. ఈ ఏడాది కాలంలో జిల్లాలో ర‌వాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది సుమారు 500 కిలోలు ఉంటుంద‌ని లెక్క‌గ‌ట్టారు. దీనిని షేర్‌ఘర్, హైవే పోలీస్ స్టేషన్‌లలోని గోదాములలో నిల్వ చేశారు. ఇక‌, ఇంకేముంది.. త‌మ‌కు ప్ర‌మోష‌న్లు ఖాయ‌మ‌ని అనుకున్న అధికారులు.. దీనికి సంబంధించి వివ‌రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

వివ‌రాలు స‌రిచూసుకున్న జ‌డ్జి..మ‌రి గంజాయి బ‌స్తాలు ఏవీ? అని ప్ర‌శ్నించారు. దీంతో పోలీసులు తొలుత ఖంగుతిన్నా.. త‌ర్వాత మాత్రం ఏమాత్రం జంకులేకుండా.. వాటిని ఎలుక‌లు తినేశాయి అని నివేదిక స‌మ‌ర్పించేశారు. ఇది విన్న అదనపు జిల్లా జడ్జి మొదట ఎస్‌ఎస్‌పి మధుర అభిషేక్ యాదవ్‌ను “ఎలుకల బెడద” నుండి విముక్తి కల్పించాలని ఆదేశించారు. అయితే.. అదేస‌మ‌యంలో.. పోలీసుల‌కు ఆయ‌న షాకిచ్చారు.

ఎలుకలు వాస్తవానికి 581 కిలోల గంజాయిని, 60 లక్షల రూపాయల విలువైన గంజాయిని తినేశాయని అంటున్నారు క‌దా… దీనిని రుజువు చేయాలని ఆదేశించారు. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న పోలీసులు.. ఎలుకలు చూడ్డానికి చిన్న‌వే అయినా.. త‌మ‌కు భ‌య‌ప‌డ‌బోవ‌ని న్యాయమూర్తికి చెప్పారు. అయితే, “కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమయానుకూలమైన చర్యలు తీసుకుంటాం” అని తాత్కాలిక సీనియర్ సూపరింటెండెంట్ మార్తాండ్ పి సింగ్ తెలిపారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రణవీర్ సింగ్ మాట్లాడుతూ, “గోదాములలో నిల్వ చేసిన 581 కిలోల కలుపును ఎలుకలు ధ్వంసం చేశాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ నిల్వ ప్రదేశాలలో ఉంచిన పదార్థాలను రక్షించడం అసాధ్యమని పోలీసులు అంటున్నారు. దావాకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీని నవంబర్ 26గా నిర్ణయించింది“ అని మీడియాకు తెలిపారు.

ఇక‌, ఇటీవ‌ల విచారించిన పొగాకు కేసులో కూడా.. సుమారు వంద‌ల కిలోల పొగాకును కూడా ఎలుక‌లు తినేశాయ‌ని.. ఇదే పోలీసులు చెప్ప‌డంపై న్యాయ‌మూర్తి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యాన్నీ పోలీసులు గ‌మ‌నించ‌లేర‌ని. ఎలుక‌లు .. పోలీసుల‌కు భ‌య‌ప‌డ‌బోవ‌ని చెప్ప‌డంపైనా.. ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ రెండు ఘ‌ట‌న‌లు రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.