వీఐపీ ద‌ర్శ‌నం ఇవ్వ‌నందుకు.. ఏపీలో కొత్త పార్టీ పెడ‌తార‌ట‌!

వినేందుకు ఒకింత ఆశ్చ‌ర్యంగానే అనిపించినా.. ఇది మాత్రం నిజం. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం.. కొన్ని ల‌క్ష‌ల‌ మంది నిత్యం తిరుప‌తికి వ‌స్తుంటారు. వీరిలో పొరుగురాష్ట్రాల‌వారు.. ఇతర దేశాల వారు కూడా ఉంటారు. అదేస‌మ‌యంలో దేశంలోని వివిధ మ‌ఠాల‌కు చెందిన స్వామీజీలు కూడా కూడా వ‌స్తుంటారు. ఎవ‌రి సౌల‌భ్యం కొద్దీ వారు శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుని స్వామి ఆశీస్సులు పొంది నిష్క్ర‌మిస్తుంటారు.

అయితే, తాజాగా శ్రీవారి క‌రుణ కోసం వ‌చ్చిన కొంద‌రు స్వామీజీలు.. భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేశారు. త‌మ‌కు వీఐపీ ద‌ర్శ‌నం క‌ల్పించ‌క‌పోవ‌డం, మీరు ఏమ‌ఠానికి చెందిన వారు అని టీటీడీ అధికారులుప్ర‌శ్నించ‌డంపై వారు కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాదు.. టీటీడీలో అవినీతి పెరిగిపోయిందంటూ.. ఫ‌క్తు రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అంతేకాదు. ఈ విష‌యాన్ని తేల్చేసేందుకు తాము త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీ పెట్టి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని.. కాషాయం క‌ట్టి.. స‌ర్వ‌సంఘ ప‌రిత్యాగులైన స్వాములు ప్ర‌క‌టించడం.. వింత‌ల్లో కెల్లా వింత‌గా మారింది.

ఏం జ‌రిగింది?
 
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు విశ్వశాంతి కోసం యాగాలు పూర్తి చేశారు. అనంతరం.. వీరు శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించారు. తొలుత వీరు అక్క‌డి అధికారుల‌ను వీఐపీ ద‌ర్శ‌నం కోసం కోరారు. అయితే, వారునిరాక‌రించారు. దీనిపై అలిగిన స్వాములు.. శ్రీనివాస మంగాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం పీఠాధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ఆస్తులు ఉన్నవారికి మాత్రమే స్వేచ్ఛగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతోందని ధ్వజమెత్తారు.

 అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. స్వామీజీల దగ్గర కూడా వసూళ్లకు పాల్పడటం బాధాకరమన్నారు. దర్శన ఏర్పాట్ల కోసం ముందుగానే లెటర్‌ ద్వారా తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వామీజీలు ఎవరైనా సరే ఎలాంటి ఏర్పాట్లు చేయలేమని స్పష్టం చేయడం దారుణమన్నారు. ఆస్తులు ఉంటేనే విలువలిస్తామనడం కచ్చితంగా వ్యాపారమే అవుతుందన్నారు. సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతామని తెలిపారు. స్వామీజీలకు, ధర్మప్రచారాలకు, హైందవ సంఘాలకు దర్శన భాగ్యం కల్పించాలని డిమాండు చేశారు.