స‌ర్పంచుల వెనుక ఆ కీల‌క నేత ఉన్నారా? వైసీపీ ఆరా!

రాష్ట్రంలో స‌ర్పంచులు తీవ్ర ఆందోళ‌న‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీకి మ‌ద్ద‌తు దారులుగా ఉండి.. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న స‌ర్పంచులు.. ఇప్పుడు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. త‌మ‌కు న్యాయం చేయ‌డంలేద‌ని, త‌మ చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా ఉండ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తు్న్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్పటికీ.. ఇప్పుడు మాత్రం మ‌రింత జోరు పెరిగింది.

చాలా మంది స‌ర్పంచులు నేరుగా సీఎం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆందోళన‌ల‌ను కూడా ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, ఏకంగా క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో అయితే జ‌గ‌న్ బొమ్మ ముందు పెట్టుకుని మ‌రీ స‌ర్పంచులు దీక్ష‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ వ‌ల్లే తాము న‌ష్ట‌పోయాయ‌మ‌ని, ఆయ‌న‌ను న‌మ్ముకుని ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, త‌మ నిధులు ప్రభుత్వం తీసుకుంద‌ని.. తిరిగి ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. ఇలా జ‌రుగుతున్న ఈ ఉద్య‌మాల‌పై.. తాజాగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నిక‌లకు ముందు ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌నే విష‌యంపై సీఎం జ‌గ‌న్ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన కొంద‌రు కీల‌క నేత‌ల‌ను ర‌ప్పించుకుని వారితో ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎక్క‌డైనా వ్య‌తిరేత‌కత రావొచ్చు కానీ, గ్రామీణ స్థాయిలో వ‌స్తే ఇబ్బందే.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ కీల‌క‌మైన స‌మాచారం తెప్పించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు తెలిసింది ఏంటంటే స‌ర్పంచుల‌కు వెనుకాల ఉండి.. వారిని ప్రోత్స‌హించి మ‌రీ ఉద్య‌మాల బాట‌ప‌ట్టిస్తున్న‌వారు టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడేన‌ని గుర్తించిన‌ట్టు స‌మాచారం. పంచాయ‌తీ చాంబ‌ర్ అధ్య‌క్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కనుస‌న్న‌ల్లోనే ఇదంతా జ‌రుగుతోంద‌ని గుర్తించార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.