చంద్ర‌బాబు చేతిలో తాజా రిపోర్ట్‌.. త‌మ్ముళ్ల‌లో టికెట్ ఫీవ‌ర్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని ప‌క్కాగా నిర్ణ‌యించుకుని, ఆదిశ‌గానే అడుగులు వేస్తున్న చంద్ర‌బాబు.. తాజాగా మ‌రోసారి త‌మ్ముళ్ల ప‌రిస్థితిని, నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేయించుకుని స‌ర్వే రిపోర్టును తెప్పించుకున్న‌ట్టు టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. దీంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి. ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దో ఇక‌, కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు ఆయ‌న నిర్ణ‌యించేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్న చాలా మందికి వ‌స్తుందో రాదో అనే ఫీవ‌ర్ ప‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా చంద్ర‌బాబుకు అందిన‌ సర్వే రిపోర్ట్‌ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని భావిస్తున్న‌ట్టు త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శ‌ర్మ‌ టీమ్‌ క్షేత్రస్థాయిలోప‌ర్య‌టించింది. అంతర్గత రహస్య సర్వేలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ మాజీ నేత‌లకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించిందని సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందోనని త‌మ్ముళ్లు టెన్షన్‌ పడుతున్నారు.

దీంతో టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్రబాబు ‘కొత్త ముఖాల’ను తెర‌మీదికి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. అయితే, పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో కొత్త ముఖాలు కూడా ప్ర‌ముఖంగా దూసుకుపోవ‌డం లేద‌ని రాబిన్ బృందం స్ప‌ష్టం చేసిందని స‌మాచారం.

సీటు తమదేనని అనుకుంటున్న సిట్టింగ్‌ మాజీలు యువ‌త‌ను పైకి ఎద‌గ‌నివ్వ‌డం లేద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దీంతో యువ‌ ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామని చెబుతున్నా.. టికెట్ ద‌క్కించుకునే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్‌ లేదని ఇప్పటికే స్పష్టం చేయడంతో చాలా జిల్లాల్లో నేత‌లు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఎలా చూసినా.. మొత్తం ఉమ్మ‌డి 13జిల్లాల ప‌రిధిలో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులకు ఇప్పుడు చంద్ర‌బాబు ధైర్యం చెప్పి.. న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. స‌ర్వే స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.