రేసింగ్ లీగ్‌లో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ

ప్రపంచానికి ఫార్ములా వన్ రేసు ఉంది. కానీ ఇండియాకు అది లేదు. గతంలో కొన్ని సీజన్ల పాటు ఇండియాలో ఫార్ములా వన్ రేసులను నిర్వహించినా.. ఏవో కారణాల వల్ల ఆపేశారు. ఇక అప్పట్నుంచి ఇండియన్ స్పోర్ట్స్ లవర్స్‌కు రేసింగ్ వినోదం లేకుండా పోయింది. అందుకే కొత్తగా ఫార్ములా-ఈ పేరుతో ఇండియాలో రేసింగ్ లీగ్ మొదలుపెట్టారు.

ఈ రేసు నిర్వహించే నాలుగు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడం విశేషం. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూ ఈ రేసు తొలి రౌండ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ట్రయల్ రన్‌తో ఈ రేసు మొదలైంది. నగరంలో ఇంతకుముందెన్నడూ చూడని ఈ రేసింగ్ వినోదాన్ని ఆస్వాదించడానికి శనివారం పెద్ద ఎత్తున సెలబ్రెటీలు, సామాన్య అభిమానులు హాజరయ్యారు. ఆదివారం ప్రధాన రేసులు జరుగుతున్నాయి.

ఈ రేసింగ్ లీగ్‌లో ఒక హైదరాబాద్ కుర్రాడు కూడా పాల్గొంటుండడం విశేషం. అతడి నేపథ్యం ఆసక్తికరం. ఆ కుర్రాడి పేరు అనిందిత్ కాగా.. అతను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు కావడం గమనార్హం. అనిందిత్ తల్లి, విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి అపోలో హాస్పిటల్స్‌కు జాయింట్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. అనిందిత్ హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ తరఫున ఈ రేసులో పాల్గొంటున్నాడు. రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్.. 2016లో యూరో జేకే 16 ఛాంపియన్‌షిప్, 2017 యూరో జేకే ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.

ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2017 మోటర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గానూ నిలిచాడు. హైదరాబాద్‌లో ఆరంభమైన రేసింగ్‌లో తెలుగు తేజం అయిన అనిందిత్ పాల్గొనడంతో అందరి దృష్టీ అతడిపై నిలిచింది. ఈ రేసులను ఆరంభించిన మంత్రి కేటీఆర్.. అనిందిత్‌ను అభినందించిం ఆల్ ద బెస్ట్ చెప్పారు.