క‌విత‌ను బీజేపీలో చేరాల‌ని ఒత్తిడి చేశారు: కేసీఆర్

బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని బీజేపీ నేత‌లు ఒత్తిడి చేశార‌ని, ఒక సంద‌ర్భంలో బెదిరింపుల‌కు కూడా దిగార‌ని కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం ఉందా? అని నిల‌దీశారు. తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ కీలక సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలపై కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని.. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తనకు అన్నీ తెలుసని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎవరూ బీజేపీకి లొంగవద్దని, సమావేశం వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దని కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు.

టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిపైనా నిఘా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని, ఈసారి కూడా సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇటీవ‌ల ముగిసిన‌ మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కూడా సమీక్ష జరిపారు. మునుగోడులో సరిగ్గా పనిచేయని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కనీసం ఐదుగురు మంత్రులు ఇంఛార్జ్‌లుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వచ్చిందన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 85 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేవలం 10 వేల మెజార్టీతో గెలవడంతో.. తమకు మెజార్టీ ఇంత స్థాయిలో తగ్గుతుందని ఊహించలేకపోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఫలితాలు వెలువడిన రోజే ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని రుజువైంది. దీంతో రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నువ్వా నేనా అనే వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఇక్క‌డి నేత‌ల‌కు క్లాస్ తీసుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.