జ‌గ‌న్‌తో వ‌ర్మ భేటీ.. ఇదిగో క్లారిటీ..

RGV Meets Jagan Mohan Reddy
RGV Meets Jagan Mohan Reddy

వివాదాస్ప‌ద సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. సుమారు రెండుగంట‌ల పాటు ఇద్ద‌రు చ‌ర్చించుకున్నారు. అయితే..ఆ చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగింద‌నేది ఎవ‌రికీ తెలియదు.. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. అయితే.. తాజాగా వ‌ర్మ‌.. ఈ ఉత్కంఠ‌కు తెర దించేశారు. తాను త్వ‌ర‌లోనే వ్యూహం అనే సీక్వెల్ చిత్రాన్ని తీయ‌నున్న‌ట్టు చెప్పారు. అది కూడా ఫ‌క్తు రాజకీయ మూవీ అని తేల్చి చెప్పేశారు.

ఎన్నికలే లక్ష్యంగా వర్మ… సీక్వెల్‌ చిత్రాల్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలో ‘వ్యూహం’ పేరుతో రాజకీయ సినిమా తీయబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇది బయోపిక్ కాదని.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ఆర్జీవీ వెల్లడించారు. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చని… కానీ రియల్ పిక్‌లో నిజాలే ఉంటాయని ఆర్జీవీ తెలిపారు. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందని మొదటి భాగం వ్యూహం షాక్‌ నుంచి తేరుకునేలోపే… శపథం పేరుతో రెండో భాగం షాక్‌ కొడుతుందని ట్వీట్‌లో వెల్లడించారు.

ఈ రెండు చిత్రాల్లోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. వ్యూహం చిత్రానికి దాసరి కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికలే లక్ష్యంగా ఈ చిత్రం తీయట్లేదంటే ఎవరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో చెప్పకూడదో చెప్పనవసరం లేదంటూ ట్వీట్‌ చేశారు.

వ‌ర్మ ట్వీట్ ఇదే..

“నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు… బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.

ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ ‘వ్యూహం’, రెండో భాగం ‘శపథం’.. రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం ‘వ్యూహం ‘ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 ‘శపథం’ లో తగులుతుంది. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ కధ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది . రాచకురుపుపైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే ‘వ్యూహం’ చిత్రం.“ అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. మ‌రి టార్గెట్ ఎవ‌రు.. ఎలా ఉంటుందో చూడాలి.