ఏపీ మంత్రులకు ఇంటెలిజెన్స్ వార్నింగ్‌!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో ఉన్న సుమారు 13 మంది మంత్రుల‌కు రాష్ట్ర ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చ‌రిక‌లు అందాయి. “మంత్రులూ జాగ్ర‌త్త‌” అని అధికారులు వారిని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరిన‌ట్టు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌య వ‌ర్గాల నుంచి మీడియాకు అన‌ధికారిక స‌మాచారం అందింది. వాస్త‌వానికి ఇంటెలిజెన్స్‌.. చెప్పిందంటే.. దీనిలో నిజం లేకుండా అయితే ఉండ‌దు. మ‌రి ఎందుకు మంత్రుల‌ను అంత‌గా అలెర్ట్ చేయాల్సి వ‌చ్చింద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. మూడు రాజ‌ధానుల‌కు వైసీపీ నాయ‌కులు.. అధిష్టానం బాట‌లో పయ‌నిస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో కూడా.. వారు ప‌ట్టించుకోకుండా.. పిడివాదం వినిపిస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, ఈ క్ర‌మంలో.. రాజ‌ధాని రైతులు చేస్తున్న‌ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా.. అడ్డంకులు సృష్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సాక్షాత్తూ రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రైతుల్లోకి వెళ్లిపోయి.. వాట‌ర్ బాటిళ్లు విస‌ర‌డం.. వారిని దూషించ‌డం కూడా.. ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చింది.

మ‌రోవైపు… రైతులు ఇంత‌గా పాద‌యాత్ర చేస్తున్నా.. వైసీపీ మంత్రులు మాత్రం.. తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ.. నోరు పారేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఒక విధ‌మైన వ్య‌తిరేక‌త మంత్రులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. విశాఖ‌లో జ‌న‌వాణి నిర్వ‌హించేందుకు వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హోట‌ల్ గ‌దికే ప‌రిమితం చేయ‌డం.. ఆయ‌న‌ను అన‌ధికారికంగా నిర్బంధించ‌డం.. జ‌న‌సేన నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. మ‌రింత‌.. వివాదానికి దారితీసింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ చెప్పు చూపిస్తూ.. వ్యాఖ్యానించ‌డం.. దీనికి వైసీపీ కౌంట‌ర్ ఇవ్వ‌డం..ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని పెంచేసింది.

ఈ నేప‌థ్యంలో.. ఒక‌వైపు వైసీపీకి, జ‌న‌సేన‌కు మ‌ధ్య ఉమ్మ‌డి రాజ‌కీయ సంగ్రామం రంజుగా సాగుతుంటే.. ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలో జన‌సేన నాయ‌కులు టెక్కలి నియోజ‌క‌వ‌ర్గం(టీడీపీరాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాదించారు)లో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోగా.. అక్క‌డ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అల‌జ‌డి సృష్టించారు. దీంతో మరింత‌గా రాజ‌కీయం స‌ల‌స‌ల మండుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. పాద‌యాత్ర చేస్తామ‌ని.. మంత్రులు ప్ర‌క‌టించేందుకు రెడీ అయ్యారు.

ఇలా వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో ఇటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ఉత్త‌రాంధ్ర జిల్లాల వ‌ర‌కు రాజ‌కీయం చాలా హాటెక్కింది. దీనినిదృష్టిలో పెట్టుకున్న ఇంటెలిజెన్స్‌.. 13 మంది మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిది. వీరిలో గుడివాడ అమ‌ర్నాథ్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, సీదిరి అప్ప‌ల‌రాజు.. వంటి ఫైర్‌బ్రాండ్లు కూడా ఉన్నారు. వీరిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు స‌హా.. గుర్తు తెలియ‌నివ్య‌క్తులు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. విన‌తి ప‌త్రాలు ఇచ్చేందుకు వ‌చ్చేవారిగా కానీ, లేదా.. మ‌రో రూపంలో కానీ.. దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు మంత్రుల‌ను హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.