ఇక‌, తేల్చుకోవాల్సింది బీజేపీనే?!

Pawan Kalyan and Somu Veeraju

ఔను.. ఇక‌, ఏపీలో ఎవ‌రితో క‌లిసి అడుగులు వేయాలి? అనే విష‌యాన్ని బీజేపీనే తేల్చుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో పొత్తు ఉంద‌ని.. ఆ పార్టీతో నే క‌లిసిన‌డుస్తామ‌ని.. నిన్న‌టి వ‌ర‌కు చెప్పిన బీజేపీ.. ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అయిపోయింది. ఎందుకంటే.. ప‌వ‌నే స్వ‌యంగా చెప్పారు.. నేను అనేక సార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఇంకా వేచి చూస్తే.. మా ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డేలా ఉంద‌ని అన్నారు. అంతేకాదు.. ఇంకా వేచి చూసే ప‌రిస్థితి లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉరుములు లేని పిడుగులా.. వెళ్లి..టీడీపీ అదినేత‌ చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు.

అయితే.. తాను బేటీ అయింది ఎన్నిక‌ల‌కు సంబందించిన విష‌యంపై కాద‌ని.. రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌ను చూస్తూ ఉండ‌లేక‌.. స‌మైక్యంగా పోరాడాల‌నే ఉద్దేశంతోనేన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి రావాల‌ని.. కోరుతున్నాన‌ని చెప్పారు. వారు బీజేపీ అయినా..క‌మ్యూనిస్టులు అయినా.. వైసీపీయేత‌ర ఏ పార్టీ అయినా.. క‌లుపుకొని ముందుకు సాగుతామ‌న్నారు. దీంతో బీజేపీ విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ఎందుకంటే.. తాము ప‌వ‌న్‌తో పొత్తుతో ఉన్నామ‌ని.. చంద్ర‌బాబుతోను.. టీడీపీతోను.. క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం లేద‌నిచెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ కు సంఘీభావం కూడా తెలిపారు.

అయితే.. అనూహ్యంగా ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. చంద్ర‌బాబు విష‌యంలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక నిర్ణ‌యం తీసుకోలేద‌నేది వాస్త‌వం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. పార్టీని చంద్ర‌బాబును కూడా వ్య‌తిరేకించారు. అయితే.. ఇప్పుడు త‌మ‌కు ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారుగా ఉన్న ప‌వ‌నే వెళ్లి చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. అనివార్య ప‌రిస్థితి బీజేపీ ముందుకు వ‌చ్చింది. 2014లో జ‌రిగిన పొత్తుల మాదిరిగానే ఇప్పుడు కూడా.. చేతులు క‌లిపితేనే మంచిద‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. సోము వీర్రాజు వంటి క‌ర‌డుగ‌ట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు మాత్రం టీడీపీతో త‌మ‌కు ప‌నిలేద‌ని.. అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ పోత్తుల బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టేశారు. మ‌రి క‌మ‌ల‌నాథులు ఏం తేల్చుకుంటారో చూడాలి.