కేసీయార్ కు షాక్ తప్పదా ?

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకే టీఆర్ఎస్ పార్టీని కేసీయార్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా విస్తరించటం మాటేమిటో కానీ తెలంగాణాలోనే షాక్ తప్పేట్లు లేదని సమాచారం. కారణం ఏమిటంటే ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తన విస్తరణను సొంత రాష్ట్రంలో కూడా చేయాలని అనుకున్నదట. కేసీయార్ తో ఉన్న స్నేహం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమున్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పార్టీ విస్తరణకు ప్రయత్నించలేదు.

గడచిన రెండు ఎన్నికల్లో కేవలం కేసీయార్ కోసమనే ఎంఐఎం పోటీని ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం చేశారు. ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్ ఎంపీ సీటుకు మాత్రమే పోటీ చేస్తున్నారు. మరి తాజాగా వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలీదు కానీ ఎంఐఎం కూడా మరికొన్ని సీట్లలో పోటీచేయాలని డిసైడ్ చేసిందని సమాచారం. నిజానికి కేసీయార్ కన్నా ముందే ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరించుందకు అసదుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తన ప్రయత్నాల్లో భాగంగానే ఎంఐఎం మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసింది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో పార్టీ తరపున ఎంఎల్ఏలు కూడా గెలిచారు. అలాగే పై రాష్ట్రాల్లోని లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా కొందరు గెలిచారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారగానే వేరే రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకుని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నది. బహుశా ఈ విషయంలో కేసీయార్-అసదుద్దీన్ మధ్య విభేదాలు వచ్చినట్లుంది.

అందుకనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సుమారు 30 అసెంబ్లీ సీట్లకు పోటీచేయాలని ఎంఐఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పోటీకి ఎంఐఎం రెడీ అవుతోందట. ఎందుకంటే ఈ జిల్లాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవిధంగా మైనారిటీల ఓట్లే గెలుపోలములను శాసించే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని అసదుద్దీన్ డిసైడ్ అయ్యారని టాక్. ఇదే జరిగితే కచ్చితంగా కేసీయార్ కు షాక్ తప్పదు.