ఉత్త‌రాంధ్ర వెల‌మ‌లు.. సీమ‌లో రెడ్లే టార్గెట్‌.. కేసీఆర్ వ్యూహం ఇదే..!


భార‌త రాష్ట్ర స‌మితి… బీఆర్ ఎస్‌ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఏపీపై వ్యూహం విస్త‌రించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మాల ప్ర‌కారం.. క‌నీసం.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఈ విష‌యం కేసీఆర్‌కు తెలియంది కాదు. ఆయ‌న అన్నీ ప‌క్కాగా లెక్క‌లు వేసుకునే జాతీయ పార్టీ స్థాప‌న‌కు రంగంలోకి దిగార‌నేది వాస్త‌వం.

సో.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు పేరు ఎత్త‌క‌పోయినా.. ప‌క్క‌నే ఉన్న తెలుగు రాష్ట్రాన్ని మాత్రం విస్మ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌రు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌నేరుగా.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, బిహార్‌.. వంటి ఇతర రాష్ట్రాల‌పై దృష్టి పెట్టినా.. నేరుగా ఏపీపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆప‌రేష‌న్ ప్రారంభించలేదు. కానీ, ఇప్పుడు అదే వ్యూహంతో ఆయ‌న ముందుకు సాగ‌నున్నార‌ని అంటున్నారు. ఏపీలో చాలా మంది నాయ‌కులు అసంతృప్తితో ఉన్నారు.

అదేస‌మ‌యంలో.. ఎంతోమంది నేత‌లు.. కులాల వారీగా కూడా విడిపోయి ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి..ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయారు. ఇప్పుడు ఇలాంటి వారిని.. టార్గెట్ చేసుకుని కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. త‌న సొంత సామాజిక వర్గం వెల‌మ స‌హా..రెడ్డి సామాజిక‌వ‌ర్గంంలో ఉన్న అసంతృప్తులు.. కాంగ్రెస్ లో ఎలాంటి ప్రాధాన్యం లేనివారు.. టీడీపీలో ఉన్నా.. అసంతృప్తితో ఉన్న‌వారు.. ఇలా అనేక రూపాల్లో టార్గెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

వీరంద‌రికీ.. హైద‌రాబాద్‌తోనూ సంబంధం ఉంది. అక్క‌డ వ్యాపారాలు.. వ్య‌వ‌హారాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని.. ముందుకు సాగితే.. ఖ‌చ్చితంగా తాను అనుకుంటున్న 6 శాతం ఓట్లు వ‌స్తాయ‌నేది కేసీఆర్ వ్యూహంగా ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ గెలిచారా.. ఓడారా? అన్న‌ది ప్ర‌దానం కాదు. కేవ‌లం ఎన్నిక‌ల్లో పోటీ.. ఓట్లు.. అంతే టార్గెట్‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ వ్యూహం కార‌ణంగా.. వైసీపీ, టీడీపీల‌కు పెద్ద దెబ్బ‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.