బ్రేకింగ్: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్

విజయదశమి నాడు సీఎం కేసీఆర్ తాను పెట్టబోతోన్న జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌)గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేషరతుగా బలపర్చారు. కేసీఆర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.

పార్టీ జెండా గతంలో మాదిరిగానే గులాబీ రంగులోనే ఉండనుంది. దాదాపుా పాత జెండాతోనే కొనసాగేందుకు ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారు ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ రిక్వెస్ట్ చేయనున్నారు. ఉత్తరాదివారిని కూడా దృష్టిలో ఉంచుకొని భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు. 2001లో పార్టీ రిజిస్ట్రేషన్‌ సమయంలో టీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీగానే పేర్కొన్నారు. అందుకే, ఇపుడు పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీఆర్ఎస్ పంపనుంది.

తెలంగాణలో టీఆర్ఎస్ సభ్యత్వం బీఆర్ఎస్ కు సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల మద్దతు తమకుందని, ఆదరణ లభిస్తుందని కేసీఆర్ అన్నారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వస్తాయని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా, గవర్నర్లుగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పారు..