ఈ ఎంపీ రూటు మారుస్తున్నారా ?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశానేని నాని తన రూటు మారుస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నాని ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసే అభ్యర్ధిని వెతుక్కోమని గతంలోనే చంద్రబాబునాయుడుకు ఎంపీ చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేయటం లేదని నానియే స్వయంగా చంద్రబాబుకు చెప్పేశారట.

ఎంపీగా పోటీచేయనని చెప్పారే కానీ ఎంఎల్ఏగా పోటీచేస్తానని మాత్రం చెప్పలేదట. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో నాని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏగా పోటీచేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇపుడిక్కడ నుండి ఎంఎల్ఏగా గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి నాని ఇక్కడి నుండే పోటీచేయాలని అనుకుంటే గద్దె పరిస్ధితి ఏమిటి ? గద్దె విజయవాడ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.

అయితే నాని ఎంఎల్ఏగా పోటీ చేయటం పార్టీలోనే బలమైన వైరి వర్గానికి ఏమాత్రం ఇష్టం లేదు. నాని అంటే బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలకు ఏ మాత్రం పడదు. వీళ్ళ మధ్య పంచాయతీ చేయలేక చివరకు చంద్రబాబు కూడా చేతులెత్తేశారు. ఎవరిని నియంత్రించాలో తెలీక, ఎవరూ కంట్రోల్లో ఉండకపోవటంతోనే పై నేతల మధ్య గొడవలు చాలాసార్లు రోడ్డున పడ్డాయి.

ఈ నేపధ్యంలోనే కేశినేని ఎంఎల్ఏగా పోటీ చేస్తారనే ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది. మరి దీనికి చంద్రబాబు అనుమతి ఉందా అనేది అనుమానమే. ఒకవేళ ఎంఎల్ఏగా పోటీ చేసేందుకు నానీకి చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఎంపీ ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నాని పార్టీ మారిపోతారని తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ మారటం లేదని ఎంపీ చెప్పినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా కనబడటం లేదు. చివరకు అధినేతతోనే అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. కాబట్టి నాని ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలీటం లేదు.