ఇందుకే వీళ్ళిద్దరినీ నమ్మటం లేదా ?

జాతీయ స్ధాయిలో ఎన్టీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాన్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తూట్లు పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల అధినేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి ఐఎన్ఎల్డీ పార్టీ ఒక ప్రయత్నం జరిగింది. హర్యనాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, ర్యాలీ జరిగింది. జయంతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాల నేతలందరినీ ఐఎన్ఎల్డీ పిలిచింది.

అయితే ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి చాలామంది నేతలు హాజరైనా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ హాజరు కాలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వీళ్ళిద్దరు గైర్హాజరైనట్లు అర్ధమైపోతోంది. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ప్రతిపక్షాల ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని బహిరంగ సభలో మాట్లాడిన నేతలంతా పదే పదే చెప్పారు. ఒక జాతీయ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకుని పోవాల్సిందే అని బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గట్టిగా చెప్పారు.

ఇక్కడే మమత, కేసీయార్ కు సమస్య వస్తోంది. వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ తో కలిసి పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. శరద్ పవార్ తో భేటీలో కాంగ్రెస్ తో చేతులు కలపడానికి మమత ఇష్టపడినా మళ్ళీ ఎందుకనో ఈ కార్యక్రమంలో హాజరుకాలేదు. కాంగ్రెస్ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనటం ఇష్టంలేకే వాళ్ళిద్దరు హాజరుకాలేదని అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి ఇదే విధమైన వైఖరిని ముందు ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంది.

మమత, కేసీయార్ కున్న లోకల్ సమస్యల కారణంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇంత స్పష్టంగా వీళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అయినా ప్రజా ఫ్రంట్ అయినా ఎలా సక్సెస్ అవుతుందన్నది అసలు పాయింట్. ఇలాంటి కారణాలతోనే మమత, కేసీయార్ ను చాలా పార్టీలు నమ్మటం లేదు.