టార్గెట్ 250 ఓట్లు

మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో కానీ తర్వాత పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కీలకమైన సమావేశం నిర్వహించారు. బట్టి చెప్పినదాని ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ కమిటి కచ్చితంగా 250 ఓట్లను తక్కువ కాకుండా పార్టీకి వేయించాలని టార్గెట్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 45 బూత్ కమిటీలున్నాయి.

అంటే బూత్ కమిటీల నుండే సుమారుగా 11500 ఓట్లు రావాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. 45 బూత్ కమిటీలను మూడు క్లాస్టర్ కమిటీలుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి బూత్ కమిటిలో సుమారు 20 మంది సభ్యులున్నారని వీరంతా తలా 15 ఓట్లు వేయించాలని బట్టి స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ ఒక సీనియర్ నేతను ఇన్చార్జిగా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బూత్ కమిటిలు, క్లాస్టర్ కమిటిలంతా సీనియర్ నేతతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలన్నారు.

భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు నిర్వహించటం కన్నా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయటంపైనే నేతలంతా దృష్టి పెట్టాలని బట్టి చెప్పారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ గెలుచుకోవటం చాలా అవసరమన్నారు. నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టు దృష్ట్యా ఉపఎన్నికలో గెలవటం పెద్ద కష్టం కూడా కాదన్నారు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఉపఎన్నిక గెలుపును చాలెంజిగా తీసుకుని పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.

మండలాల్లో పనిచేసే సీనియర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మంచి మెజారిటీ తీసుకొస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఖాయమని రేవంత్ ఇప్పటికే హామీ ఇచ్చున్నారు. అంటే పార్టీలోని సీనియర్లంతా ఉపఎన్నికలో గెలుపుకోసం ఎవరిస్ధాయిలో వాళ్ళు చిత్తశుద్దితో పనిచేయాలని గట్టిగానే అనుకున్నట్లు అనిపిస్తున్నది. అయితే ఇదంతా ఎన్నికలు పూర్తయ్యే దాకా ఉంటుందా అనేదే సందేహం. ఎక్కడో జరిగే చిన్న ఘటనను పట్టుకుని కూడా సీనియర్లు కుమ్ములాడేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. మరి ఉపఎన్నికలో ఏమవుతుందో చూడాలి.