ఇప్పుడేమంటారు.. జ‌గ‌న్ స‌ర్‌.. కృష్ణాలో రైతుల‌కు బ్ర‌హ్మ‌ర‌థం!

అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా పేర్కొంటూ.. ప్ర‌బుత్వం అభ‌వృద్ధి చేయాల‌నే డిమాండ్‌తో ఇక్క‌డి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర 2.0 పై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం అక్క‌డి రైతులు అమ్ముడు పోయార‌ని.. పెయిడ్ యాత్ర అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన కొంద‌రు రైతుల ముసుగులో పాల్గొంటున్నార‌ని కూడా సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. సాక్షాత్తూ నిండు అసెంబ్లీలోనూ ఇదే వ్యాఖ్య చేశారు.

అయితే.. తాజాగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర‌.. గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశిం చింది. అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు.. వృద్ధులు, దివ్యాంగులు ఇలా ఎంద‌రో.. ఈ పాద‌యాత్ర‌లో న‌డుస్తున్నారు. ఈ రోజు ఈ యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకుంది. కృష్ణాజిల్లాలోని దివిసీమలోకి ఈ పాద‌యాత్ర అడుగు పెట్ట‌గానే.. స్థానిక ప్ర‌జ‌లు ఎదురేగి మ‌రీ రైతుల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దీంతో పండుగ వాతావరణం తలపించింది.

పల్లె పల్లెల నుండి తరలివచ్చిన ప్రజలు అమరావతి రైతులకు స్వాగతం పలికారు. వారధి కింద ప్రవ‌హించాల్సిన కృష్ణమ్మ.. వారధిపై ప్రవహిస్తోందా అన్నట్లుగా సాగుతున్న ప్రజా పాదయాత్ర.. గుంటూ రు జిల్లా రేపల్లె నుండి కృష్ణాజిల్లా చల్లపల్లి వరకు సాగ‌నుంది. పెనుముడి వద్ద అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు.. మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్.

మహా పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ఇన్ఛార్జ్ కొనకళ్ల నారాయణ, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు మండలి రాజా, పెడన నియోజకవర్గ ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, తదితరులు.. రైతుల‌కు పూల‌మాల‌లు వేసి.. స్వాగ‌తం ప‌లికారు. స్థానిక ప్ర‌జ‌లు కూడా ఎదురు వెళ్లి.. హార‌తులు ప‌ట్టారు. మహా పాదయాత్రకు అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు మ‌ద్ద‌తు తెలిపారు. మ‌రి దీనిపైనా.. సీఎం జ‌గ‌న్‌.. కామెంట్ చేస్తారా? కృష్ణాజిల్లాలోనూ పెయిడ్ ఆర్టిస్టులే.. రైతుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నార‌ని అంటారేమో.. చూడాలి!!