జగన్ పై విరుచుకుపడిన తెలంగాణ ఫైర్ లేడీ

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై.. కాంగ్రెస్ తెలంగాణ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి.. రేణుకా చౌద‌రి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జ‌గ‌న్ ఒక మూర్ఖుడు! అంటూ.. నిప్పులు చెరిగారు. “ఆయ‌న‌కు పాల‌న రాదు.. ప్ర‌జ‌ల‌తో ఎలా మాట్లాడాలో తెలీదు. ఆయ‌న‌కు ఎందుకు ఓట్లేశామా.. అంటూ.. ప్ర‌జ‌లు నిత్యం బాధ‌ప‌డుతున్నారు. ఏపీలో నాకు చాలా మంది తెలుసు. వాళ్ల‌ను ఎప్పుడు ప‌ల‌క‌రించినా.. జ‌గ‌న్ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నామ‌ని చెబుతున్నారు“ అని రేణుక సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్ర అని రేణుకా చౌదరి అన్నారు. సోమవారం అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైన‌.. మ‌రో విడ‌త రైతు పాద‌యాత్ర‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె రైతుల‌తో కూడిన ట్రాక్ట‌ర్‌ను స్వ‌యంగా న‌డుపుతూ.. పాద‌యాత్రలో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. ఈ సంద‌ర్భంగా రేణుకా చౌద‌రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా అప్పుడు వచ్చానని.. ఇప్పుడూ వచ్చానని.. మళ్లీ వస్తానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మూర్ఖ‌పుపాలన చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయ‌న‌ను ఎన్నుకుని ప్ర‌జ‌లు త‌ప్పు చేశార‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఎక్క‌డికీ పోద‌న్నారు. హైకోర్టు.. ప్ర‌జ‌లు.. అంద‌రూ రైతుల‌కు అండ‌గా ఉంటార‌న్నారు. మ‌రో కొన్ని నెల్ల‌లోనే జ‌గ‌న్ పాల‌న అంత‌మై పోతుంద‌ని జోస్యం చెప్పారు. అప్పుడు నిర్విఘ్నంగా అమ‌రావ‌తి నిర్మాణం సాగుతుంద‌న్నారు. కాగా, ఇదే స‌మ‌యంలో బీజేపీపైనా రేణుక విరుచుకుప‌డ్డారు.

ఏపీ రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం అమరావతికి అండగా నిలబడతామని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఏమయ్యారని రేణుకా చౌదరి మోడీని ప్రశ్నించారు. ఇప్పుడు అమ‌రావ‌తికి అండ‌గా నిలుస్తామ‌ని చెబుతున్న రాష్ట్ర బీజేపీ నేత‌లు.. మూడేళ్లుగా క‌ళ్లుమూసుకున్నారా? అని ప్ర‌శ్నించారు. రైతుల‌ను.. పోలీసులు చిత‌క‌బాదుతుంటే.. వినోదం చూసిన బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడు ఏం హ‌క్కుంద‌ని.. వారు త‌మ మొహాల‌ను ఎక్క‌డ దాచుకుంటార‌ని నిప్పులు చెరిగారు.