కేసీఆర్ నమ్మకం ఏంటో ?

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీయార్ ప్రకటించారు. 24 గంటల కరెంటు ఇపుడు తెలంగాణాలో మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని జనాలకు పిలుపిచ్చారు. జనాలు ఆశీర్వదిస్తే కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వెళతానని కూడా చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరు పోరాడాలన్నారు. కొంతకాలంగా నరేంద్రమోడీని కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను జాగ్రత్తగా గమనిస్తే నాన్ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడేందుకు 90 శాతం అవకాశమైతే లేదు. ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావటం సాధ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది. నాన్ ఎన్డీయే పార్టీలంటే ముందు కాంగ్రెస్ పార్టీనే తీసుకోవాలి. ఇప్పటికే యూపీఏ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయటానికి మమతా బెనర్జీ, కేసీయార్ లాంటి వాళ్ళు ఇష్టపడటంలేదు.

కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అండలేకుండా ఎన్డీయేని ఎదుర్కోవటం నాన్ ఎన్డీయే పార్టీలకు సాధ్యం కాదు. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని అంగీకరించటానికి మమత, కేసీయార్ ఇష్టపడటంలేదు. మరలాంటపుడు ఎన్డీయేని గద్దె దించటం ఎలా సాధ్యం ? ఒక వైపేమో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే బాహుబలిలాగ కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి ఎన్డీయేకే అవకాశముంది. వాస్తవాలు ఇలాగుంటే కేసీయార్ మాత్రం దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేస్తామంటు హామీలు గుప్పించేస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ఎన్డీయేని గద్దె దింపేయాలని కేసీయార్ పిలుపివ్వటంలో తప్పేలేదు. కానీ అసలు కేసీయార్ ఏ పార్టీలతో కలుసుంటారు ? కేసీయార్ తో కలవటానికి ఎన్నిపార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నదే అసలు పాయింట్. ఎందుకంటే కేసీయార్ క్రెడిబులిటి ఏమిటో జాతీయపార్టీలన్నింటికీ తెలుసు. అందుకనే ఈ సీఎంతో చేతులు కలపటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంతోటి దానికి పెద్ద పెద్ద హామీలే గుప్పించేయటం ఓవర్ యాక్షన్ లాగే ఉంది.